Sunday 24 December 2017

కవిత్వ శిఖరం అటల్ బిహారీ


     - డాక్టర్ రాయారావు సూర్య ప్రకాశ్ రావు
(ఈ నెల 25న అటల్ బిహారీ వాజ్ పేయి 94వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం ) 

కవిత్వం నిరంతరాయంగా రాసే రాజకీయ నాయకులు అతి కొద్దిమందే. రాజకీయంలో తలమునకలై కొద్దిపాటి సమయం కూడా దొరకని ప్రధానమంత్రి పదవి నిర్వర్తిస్తూ కూడా కవిత్వం రాయగలగడం దాదాపు అసాధ్యం. అటల్ బిహారీ వాజ్ పేయి లాంటి వారికే అది సాధ్యమైంది.
దీర్ఘ కాలం పార్లమెంటులో సభ్యుడిగా ఉన్న అటల్ బిహారీ 1924 డిసెంబరు 25న గ్వాలియర్ లో జన్మించారు. ఆయన పితామహులు పండిట్ శ్యాంలాల్ వాజ్ పేయి గొప్ప సంస్కృత పండితులు. అటల్  తండ్రి పండిట్ కృష్ణ బిహారీ కవిగా సుప్రసిద్ధులు. ‘జయంతి ప్రతాప్’ అనే పత్రికలో ఆయన కవితలు ప్రచురితమయ్యాయి. కృష్ణ బిహారీ కవిగానే కాకుండా గొప్ప వక్తగా కూడా పేరుపొందారు. అటల్ పెద్దన్న పండిట్ అవధ్ బిహారీ వాజ్ పేయి కూడా కవిత్వం రచించేవారు.  ఇంట్లో ఉండే సాహిత్య వాతావరణం అటల్ ను కవిత్వం వైపు ప్రేరేపించింది.
కాన్పూరులోని డి.ఎ.వి. కళాశాల నుండి రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ. ఉత్తీర్ణుడైన అటల్ ఎల్.ఎల్.బి. కోర్సులో చేరినా సంఘ్ కార్యకలాపాల వల్ల చదువు పూర్తి చేయలేకపోయారు. 1939లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో అటల్ స్వయంసేవకుడిగా చేరారు. 18 సంవత్సరాల వయస్సులో గాంధీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారు. ఆర్య సమాజ యువజన విభాగం ఆర్య కుమార్ సభకు 1944లో ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో ప్రచారకుడిగా పూర్తిస్థాయి కార్యకర్త అయ్యారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి విస్తారక్ గా నియమితులయ్యారు. అదే సమయంలో ‘రాష్ట్ర ధర్మ’ మాసపత్రిక, ‘పాంచజన్య’ వారపత్రికలతో పాటు ‘స్వదేశ్’, ‘వీర్ అర్జున్’ అనే దిన పత్రికల్లో కూడా పనిచేశారు.  1951లో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుడయ్యారు.
1957లో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఇరవై ఏళ్ల పాటు భారతీయ జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేశారు.  1996లో 11వ లోక్ సభకు ఎన్నికై ప్రధానమంత్రిగా 13 రోజులు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 1998లో పూర్తి మెజారిటీతో మళ్ళీ గెలిచి, ప్రధాన మంత్రిగా పూర్తి కాలం బాధ్యతలు నిర్వహించారు.
అటల్ బిహారీ అనేక అవార్డులు పొందారు. 1992లో పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. 1993లో కాన్పూరు విశ్వవిద్యాలయం నుండి డి.లిట్. పొందారు. 1994లో లోకమాన్య తిలక్ అవార్డు పొందారు. అదే సంవత్సరం ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు లభించింది. అదే ఏట గోబింద్ వల్లభ్ పంత్ అవార్డు పొందారు. 2015లో భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న పురస్కార గ్రహీత అయ్యారు.
రాజకీయ జీవితంలో తలమునకలైనా కవిత్వసాధనను విడిచి పెట్టని  గొప్ప కవి అటల్ జీ. ఆయన రచించిన మొదటి కవిత ‘తాజ్ మహల్’లో అభ్యుదయ వాదం కనబడుతుంది. వాజ్ పేయి అత్యున్నత శిఖరం అయినా సామాన్యుడి నుండి దూరం కావద్దని కోరుకున్నారు.
“హే ప్రభూ!
నాకు ఇంతటి ఎత్తు ఎప్పుడూ ఇవ్వకు
ఇతరులను గుండెలకు హత్తుకోనంతగా
అంతటి హృదయ కాఠీన్యాన్ని
ఎప్పుడూ నాకు ఇవ్వకు...”
ఇంతగా సామాన్యుడితో కలిసిపోవాలని కోరుకునే నాయకుడు ఎవరుంటారు? తనకు శిఖరాలు లభించకపోయినా పర్వాలేదు గానీ ఇతరుల నుండి దూరం చేయొద్దని మనసారా వాంఛ కనబరిచేవారు ఎవరన్నా ఉంటారా? శిఖర స్థాయి వద్దని కోరుకోడానికి కారణం కూడా తనే చెప్పారు వాజ్ పేయి.
“ఎత్తయిన పర్వతాలపై
చెట్లు ఎదగవు
మొక్కలు మొలకెత్తవు
గడ్డి పరక కూడా పరచుకోదు”
వాజ్ పేయి భావన వెనుక ఉన్న సునిశిత పరిశీలనకి ఉదాహరణ ఇది.  
“గాలి గోపురంలా ఒంటరిగా
తనవాళ్లకు దూరంగా
శూన్యంలో ఏకాకిగా మిగిలిపోవడం
పర్వతాల గొప్పదనం కానేకాదు
అది కేవలం నిస్సహాయత”
అందుకే ఆ నిస్సహాయత తనకు వద్దని ఆయన కోరుకుంటారు.
“రుతువులు ఏవైనా
వసంతం కానీ హేమంతం కానీ
కేవలం ఎత్తుగా ఎదగడమే అయితే
నిశ్శబ్దంగా ఒంటరిగా మిగిలిపోవడమే!”
అలా ఒంటరిగా మిగిలిపోయేవాడు సమూహానికి దూరమవుతాడు. అందుకే శిఖరం కావద్దని కోరుకుంటారు వాజ్ పేయి.
ఎమర్జెన్సీలో జైలు పాలైన సందర్భంలో వాజ్ పేయి రాసిన కవితలో
“చీకటి రాత్రి
విసిరిన సవాలు ఇది
కిరణమే చివరి అస్త్రమవుతుంది”
అంటూ అప్పటి ప్రభుత్వానికి సవాలు విసిరారు.
“తలవంచడం
మాకు సమ్మతం కాదు
పందెంలో అన్నీ ఒడ్డి నిలబడ్డాం
నేలకొరుగుతాం కానీ తలవంచం”
అంటూ లక్ష్య సాధన పట్ల తనకుండే నిబద్ధతను కవిత్వీకరించారు వాజ్ పేయి.
అదే సందర్భంలో రాసిన మరో కవితలో
“జైలులో ఉన్న కవి మనస్సులో ఒక ఆలోచన మెరిసింది
ఏ వ్యక్తి కూడా జీవితంలో నిరాశ చెందరాదని
నిషా వక్ష స్థలాన్ని చీల్చుకొని
మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తాడు!”
ఎంతో ఆశావహ దృక్పథాన్ని కనబరిచిన కవిత్వ పాదాలివి. నాటి ఎమర్జెన్సీ రోజుల్లో నిర్బంధంలో ఉంటూ పరిస్థితులు మారతాయని ఆశాభావాన్ని కనబర్చారు వాజ్ పేయి.
ధర్మరాజును కూడా పాప పంకిలం వదిలిపెట్టలేదన్న సూక్ష్మ పరిశీలన వాజ్ పేయిది. అందుకే
“ధర్మరాజు కూడా
జూద మోహ క్రీడలని వదులు కోలేదు
అందుకే జూద పంకిలం అంటుకున్నది
ప్రతి న్యాయ పంచాయితీలో
పాంచాలియైనా
నిరుపేద స్త్రీయైనా
అవమానితయే
ఇప్పుడు
కృష్ణుడు లేని
మహాభారతం కావాలి”
అంటారు వాజ్ పేయి.
తన కవిత్వం ఓడిపోయిన సైనికుడి నిరాశావాద గుండె చప్పుడు కాదని, విజయం సాధించి తీరతాననే పోరాట యోధుని అచంచల ఆత్మవిశ్వాస దృక్కోణమని పేర్కొంటారు అటల్ జీ. ప్రజల పక్షాన వకాల్తా పుచ్చుకునే న్యాయవాదిగా, మానవతావాదిగా, దేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రేమికుడిగా, ప్రజా శ్రేయస్సు కోరుకునే నాయకుడిగా తన కవిత్వంలో కనబడతారు వాజ్ పేయి.  సూక్ష్మ పరిశీలన, భారతీయ దార్శనికతను ఆధునిక భావనలతో విశ్లేషించడం వాజ్ పేయి కవిత్వంలో కనబడతాయి. వాజ్ పేయి శిఖర స్థాయిని నిరాకరించిన శిఖర సమానుడు.


Saturday 23 December 2017

సృజనశీలి పి.వి.

డిసెంబరు 23న మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు వర్ధంతి. ఈ సందర్భంగా నేటి ఆంధ్రజ్యోతి దినపత్రిక హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లలో ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా వ్యాసం. 

Monday 11 December 2017

జాగృతి కవితాంజలి మేడ్చల్ జిల్లా కార్యక్రమం ఫోటోలు



మిత్రులారా,
2017 ఆగస్టు 30నాడు మేడ్చల్ జిల్లాలో జరిగిన జాగృతి కవితాంజలి కార్యక్రమం ఫోటోలు కింది లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

Jagruthi Kavithanjali Medchal District Programme Photos- Dr.R.Surya Prakash Rao

Wednesday 29 November 2017

ప్రపంచ తెలుగు మహాసభలపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన

ప్రపంచ తెలుగు మహాసభలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శాసనసభలో చేసిన ప్రకటన. 

Friday 17 November 2017

ప్రపంచ తెలుగు మహాసభలు- ప్రతినిధుల నమోదు



ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రతినిధులుగా పాల్గొనదలచిన వారు కింది వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకునేందుకు ముందు బ్లడ్ గ్రూపు, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ మొదలైన వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. జె.పి.జి. ఫార్మాట్ లో ఫోటోను, పి.డి.ఎఫ్. ఫార్మాట్ లో ఆధార్ కార్డును మీ సిస్టం లో ముందుగానే కాపీ చేసి పెట్టుకోండి.... డా. రాయారావు సూర్య ప్రకాశ్ రావు. 

http://wtc.telangana.gov.in/online-applications/registration-form/

Wednesday 1 November 2017

తెలంగాణ వైతాళికులు వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి ఈరోజు. 

ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం నేటి (2017 నవంబరు 1) 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.


Monday 30 October 2017

చైతన్యం, అధ్యయనం వట్టికోట నేర్పిన సూత్రాలు (కలం పేజీ- 'మన తెలంగాణ' దినపత్రిక- 2017 అక్టోబరు 30)


నవంబరు ఒకటిన వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి. 
ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం నేటి (2017 అక్టోబరు 30) 'మన తెలంగాణ' దినపత్రిక సాహిత్య అనుబంధం 'కలం'పేజీలో ప్రచురితం.

Monday 23 October 2017

బ్లూ వేల్ (కవిత, మన తెలంగాణ, 2017 అక్టోబరు 23)


'మన తెలంగాణ' దినపత్రిక సాహిత్య అనుబంధం 'కలం'లో 2017 అక్టోబరు 23న ప్రచురితమైన నా కవిత

Wednesday 11 October 2017

చిన్న జిల్లాలతో విద్యా వికాసం (ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీ- 11.10.2017)


తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి నేటికి (11.10.2017) ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం 11.10.2017 'ఆంధ్ర జ్యోతి' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.

Wednesday 27 September 2017

బతుకమ్మ సందేశం (కవిత) --- Bathukamma Sandesham (Poem)


ఈరోజు (27.09.2017) 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా కవిత. 

My poem published in Edit page of 'Namaste Telangana' daily today (27.09.2017)

Monday 11 September 2017







వరంగల్ నుండి తొలి లోక్ సభ కు ప్రాతినిధ్యం వహించిన పెండ్యాల రాఘవరావు గారి కృషి పై నేను రాసిన వ్యాసం  మన తెలంగాణ దినపత్రిక సాహిత్య అనుబంధం 'కలం' పేజీ లో ప్రచురితం. (కలం పేజీ, మన తెలంగాణ దినపత్రిక, 2017 సెప్టెంబరు 11)

Monday 28 August 2017

అభాగ్యజీవులు - అస్తిత్వాల గ్రంథం (పుస్తక సమీక్ష)


విరసం ప్రచురించిన 'అభాగ్య జీవులు' గ్రంథంపై నేను రాసిన సమీక్ష- 28.08.2017 'మన తెలంగాణ' దినపత్రిక  సాహిత్య అనుబంధం 'కలం'లో ప్రచురితం 

Friday 25 August 2017

బహుముఖ ప్రజ్ఞాశాలి దేవులపల్లి

తెలంగాణ వైతాళికులు దేవులపల్లి రామానుజ రావు గారిపై నేను రాసిన వ్యాసం నేటి 'మన తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.

(25.08.2017, 'మన తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీ)




http://epaper.manatelangana.news/c/21602820

Monday 7 August 2017

సాహితీ భీష్ముడి అస్తమయం తీరని లోటు


తొమ్మిది దశాబ్దాల ప్రాయం దాటి రెండేళ్లు గడుస్తున్నా అలుపెరుగక నిరంతర సాహితీ ప్రయాణం చేస్తూ వచ్చిన డాక్టర్ పోతుకూచి సాంబశివరావు గారు అస్తమించడం బాధాకరం. ఆయన అస్తమయంతో తెలుగు సాహితీలోకం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన ప్రముఖ రచయిత, కవి, న్యాయవాది, సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు, సంపాదకులు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ‘కళాప్రపూర్ణ’ బిరుదాంకితులు.
వారితో నాకు దాదాపు 30 సంవత్సరాల క్రితం పరిచయం. నేను రాసిన కవిత్వాన్ని ప్రచురణ రూపంలోకి తెచ్చి ఒక గుర్తింపు ఇచ్చిన వారు పోతుకూచి సాంబశివరావు. చిన్నా పెద్దా తేడా లేకుండా అరమరికల్లేకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం వారిది. పెద్దవాళ్లతో ఎలా జోకులేస్తారో చిన్నవాళ్లతో కూడా అలాగే కులాసాగా ఉండేవారు.
పోతుకూచి గారు అవివాహితులు. 1990 దశకంలో నేను అప్పుడప్పుడూ వారి ‘విశ్వరచన’, ‘యూనిలిట్’ పత్రికల ఎడిటింగ్ పని చూసేవాడిని. అప్పుడే అడిగాను “మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేద”ని. దానికి ఆయన తమాషా సమాధానం “నాకు వంట వచ్చు. ఇక పెళ్ళితో పనేముంది” అని.  పెళ్ళికి దూరంగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆయన ఎంతో మందికి పెళ్ళి సంబంధాలు కుదిర్చారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఒక కళ్యాణ వేదిక కూడా నిర్వహించారు. ఆ సందర్భంలో ఎవరో ఒక సంబంధం కోసం వారి ఆఫీస్ కి వచ్చారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. వారికి ఏదో సంబంధం గురించి చెప్తున్నారు. వారడిగిన ప్రశ్న ఆ వరుడి ఎత్తు ఎంత అని. నన్ను ఉదాహరణగా చూపాలనుకుని నా ఎత్తెంతో అడిగారు. తెలియదన్నా. “నీ ఎత్తు నీకు తెలియకపోతే ఎలాగయ్యా” అన్నారు.
పోతుకూచి గారికి మానవ సంబంధాలపై ఆసక్తి అమితం. ఎవరిని కలిసినా అపరిమితమైన ఆనందం వ్యక్తపర్చేవారు. వారితో తనకు ఉన్నఅనుబంధాన్ని వివరించేవారు. వారి చేయి పట్టుకుని గట్టిగా ఊపేసేవారు. వారి హస్త బంధనం నుండి విడివడడం కష్టం. పెద్ద పెద్ద వాళ్లతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని సందర్భాన్ని బట్టి చెప్పేవారు. ఎవరు ఫోన్ చేసినా ఇంటికి రమ్మనేవారు. కలవాలనే ఆసక్తి వ్యక్తం చేసేవారు.
నాకు జీవితంలో ఆర్ధిక విషయంలో జరిగిన మోసం గురించి, దానివల్ల నేను పడుతున్న ఇబ్బందులను గురించి ఈమధ్య ఆయనను కలిసినపుడు చెప్పాను. “అలాంటి వాళ్లని కాల్చిపారేయాలయ్యా” అన్నారు. నాకు ధైర్యం చెప్పారు.
ఆయన ఆరోగ్య రహస్యం అడిగాను. వెంటనే “ఆయుర్వేదం” అన్నారు. ఆయుర్వేద మందులను తానే నూరుకునేవారు కూడా. తన వంట తానే చేసుకునేవారు. “ఒంటరిగా ఉండడం ఇబ్బందిగా లేదా సార్” అని అడిగాను. “పుస్తకాలు నా నేస్తాలు. ఇక నేను ఒంటరిని ఎలా అవుతాను” అన్నారు. నిజమే పుస్తకాలు ఆయనకు అత్యంత ఇష్టమైన నేస్తాలు. పుస్తకాలు చదవడం ఆయనకు చాలా ఇష్టం. బహుమతిగా కూడా పుస్తకాలే ఇచ్చేవారు. అప్పట్లో న్యూ బోయిగూడలో ఆయన నివాసం నిండా పుస్తకాలే ఉండేవి. ఇప్పుడు కవాడీగూడా నివాసంలోనూ అంతే.
“ఈ వయసులో వంట చేయడం ఇబ్బంది కదా” అన్నాను- వంట మనిషినైనా పెట్టుకుంటే బాగుండేదన్న ఆలోచనతో. నవ్వారు. “వంట చేయడం ఏమన్నా ఘన కార్యమా” అని ప్రశ్నించారు.  తాను వంట ఎలా చేసుకుంటారో వివరించారు.
ఒక సందర్భంలో స్వీట్ షాప్ నుండి ఫోన్ చేశాను. “మీకిష్టమైన స్వీట్ ఏంటో చెప్పండి సార్’ అని. ఏదైనా పర్వాలేదన్నారు. ఆశ్చర్యపోయాను. ఆ వయసులో నిజానికి చాలామంది స్వీట్లకు దూరంగా ఉంటారు కదా అని. ఆయన ఆరోగ్యం అలాంటిది.
మా గురువు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారి బాల్యంలో పాఠశాల వార్షికోత్సవంలో ఉపాధ్యాయులందరూ కలిసి పోతుకూచి గారు రాసిన ‘ఏడు సున్నాలు’ అనే నాటకాన్ని ప్రదర్శించారు. “ఆ రోజుల్లో సినిమా థియేటర్ లేని నారాయణఖేడ్ కి అదే పెద్ద సినిమా” అని నేను నా సిద్ధాంత గ్రంథం ‘అమ్మంగి వేణుగోపాల్ రచనలు- సమగ్ర పరిశీలన’ లో రాశాను. ఈ విషయాన్ని పోతుకూచి గారితో ఈ మధ్య ఆ గ్రంథాన్ని ఇస్తూ ప్రస్తావించాను. చాలా సంతోషపడ్డారు.
ఇటీవల ఆచార్య సి.నారాయణ రెడ్డి గారి అంత్యక్రియల సందర్భంలో వారి భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వచ్చారు సాంబశివరావు గారు. తెలంగాణ సారస్వత పరిషత్తు హాలు నిండా జనం. మెట్ల మార్గానికి అడ్డంగా కుర్చీవేసి ఆయనను ఎవరో కూర్చుండబెట్టారు. మెట్ల మార్గం గుండా నారాయణరెడ్డి గారి భౌతిక కాయాన్ని సందర్శించేందుకు జనం తోపులాట. సాంబశివరావు గారు కూర్చున్న కుర్చీపై పడబోతున్న వారిని ఒక చేత్తో అడ్డుకుని మరో చేత్తో ఆయనను నెమ్మదిగా పైకి లేపాను. పక్కకి తీసుకొచ్చి సురక్షిత స్థానంలో కుర్చీవేసి కూర్చుండపెట్టాను. ఆయన కళ్లలో ధన్యవాదపూర్వకంగా మెరుపు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగాను. “నాకేం!” అన్నారు- నిక్షేపంగా ఉన్నానని ఆయన భావం. కుర్చీలో కూర్చున్నా ఒక చేత్తో నన్ను పట్టుకున్నారు. అదే చివరిసారి వారిని చూడడం.
92 సంవత్సరాల వయస్సులోనూ తన పనులు తాను చేసుకోవడం, తన వంట తాను వండుకోవడం చేసేవారు ఆయన. మిత్రులకు స్వయంగా ఉత్తరాలు రాసేవారు. వివిధ సాహిత్య కార్యక్రమాల నిర్వహణా భారాన్ని తానే మోసేవారు. అందరికీ ఫోన్లు చేసి గుర్తుచేసేవారు. జ్యోతిష్యంలోనూ, ఆయుర్వేదంలోనూ ఆయనకు అభిరుచి ఉంది.
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ సభ్యులుగా, ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర సలహాసంఘ సభ్యులుగా, ఆంధ్ర మహిళా సభ సాహిత్య నిర్వాహక మండలి సభ్యులుగా, కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యులుగా పోతుకూచి గారు సేవలందించారు. యునెస్కో సదస్సులో దక్షిణ భారత దేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. అఖిల భారత తెలుగు రచయితల మహాసభలను నిర్వహించారు. నవ్య సాహితీ సమితి, విశ్వసాహితి సంస్థలను స్థాపించి సాహిత్య సేవ చేశారు. ‘విశ్వ రచన’ తెలుగు పత్రికకు, ‘యూనిలిట్’ ఆంగ్ల పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆయన నటులు కూడా.
వివిధ పత్రికల్లో ఆయన అనేక వ్యాసాలు రాశారు. ఆంగ్లం, హిందీ, కన్నడ భాషలలోని రచనలను అనువదించి, తెలుగులోకి తెచ్చారు. ‘రాసి-సిరా’, ‘పోతుకూచీయం’, ‘అగ్నినాదాలు’ మొదలైన పదికిపైగా కవితాసంపుటాలను వెలువరించారు. ‘హంతకులు’, ‘పల్లె కదిలింది’, ‘అద్దె కొంపలో ఒక నెల’, ‘చుట్టాల రభస’ మొదలైన పలు నాటకాలు, నాటికలు రచించారు. ‘అన్వేషణ’, ‘ఉదయ కిరణాలు’, ‘చలమయ్య షష్టిపూర్తి’ మొదలైన ఐదు నవలలు రాశారు. ‘నవ కదంబం’, ‘బ్రతుకుల పతనం’, ‘సాంబశివరావు కథలు’ మొదలైన కథాసంపుటాలను వెలువరించారు. మూడు వందలకు పైగా కథలు రాశారు. ఆయన రచించిన పలు కథలు హిందీ, కన్నడ, తమిళం, రష్యన్, జర్మన్, ఆంగ్ల భాషల్లోకి అనువదించబడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవిత చరిత్రను ‘సంజీవయ్య సందర్శనం’గా వెలువరించారు. షిర్డీ సాయిబాబా జీవిత చరిత్రను కూడా ఆయన రచించారు. తన ఆత్మ  కథ తొలిభాగాన్ని ఈనెల 2న ఆవిష్కరించారు.

‘సాహితీ భీష్మ’ డాక్టర్ సాంబశివరావు గారి మరణం తెలుగు సాహిత్యరంగానికి తీరని లోటు. 

Sunday 6 August 2017

జాతీయ విజ్ఞాన కమిషన్ సూచనలు (డాక్టర్ పి.ఎం.భార్గవ గారి మృతి సందర్భంగా)

 ఇటీవల మరణించిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పుష్పమిత్ర భార్గవ గారికి విద్యారంగంపై సమగ్ర అవగాహన ఉంది. ఉమ్మడి పాఠశాల వ్యవస్థ మొదలైన అంశాల్లో ఆయన ఆలోచనా ధోరణి శ్లాఘనీయం. జాతీయ విజ్ఞాన కమిషన్ ఉపాధ్యక్షుడిగా ఉంటూనే వివిధ అంశాల్లో కమిషన్ అభిప్రాయాలతో విభేదించారు. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ దశాబ్దం క్రితం నేను రాసిన వ్యాసం డాక్టర్ పుష్పమిత్ర భార్గవ గారి మృతి సందర్భంగా ఇక్కడ షేర్ చేస్తున్నాను.





Wednesday 2 August 2017

ముగ్గురూ ముగ్గురే - శిఖర సమానులే




ముగ్గురూ ముగ్గురే

శిఖర సమానులే


ఒకే పక్ష కాలంలో మరణించిన ఆ ముగ్గురూ భారత దేశ విజ్ఞానశాస్త్ర ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటిచెప్పారు. దేశానికి ప్రతినిధులుగా శాస్త్ర, సాంకేతిక, విద్యారంగాల్లో అసమాన ప్రతిభను ప్రదర్శించారు. భారత దేశ పౌర పురస్కారాలను అందుకున్న ఆ ముగ్గురు విశిష్ట సేవా మూర్తులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఆచార్య ఉడుపి రామచంద్ర రావు,  విశ్వవిద్యాలయాల నిధుల సంస్థ అధ్యక్షుడిగా 
పనిచేసిన ఆచార్య యశ్ పాల్ సింగ్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ వ్యవస్థాపక సంచాలకులుగా పనిచేసిన డాక్టర్ పుష్పమిత్ర భార్గవ.
వీరిలో ఆచార్య యు.ఆర్.రావు దక్షిణభారతదేశానికి, ఆచార్య యశ్ పాల్ ఉత్తర భారతదేశానికి చెందినవారు. డాక్టర్ పి.ఎం.భార్గవ ఉత్తర, దక్షిణ భారతాలు రెంటితోనూ అవినాభావ సంబంధాలున్నవారు. కర్నాటక రాష్ట్రంలోని అడమారులో ఆచార్య యు.ఆర్. రావు 1932 మార్చి 10న జన్మించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న ఝాంగ్ లో 1926 నవంబరు 26న పుట్టారు ఆచార్య యశ్ పాల్. 1928 ఫిబ్రవరి 22 న రాజస్థాన్ లోని అజ్మీర్ లో జన్మించినా దక్షిణ భారతదేశంలోని హైదరాబాదులో స్థిరపడిపోయారు డాక్టర్ పి.ఎం.భార్గవ.

ఈ ముగ్గురిలో ఆచార్య యు.ఆర్.రావు, ఆచార్య యశ్ పాల్ భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ గ్రహీతలు కాగా డాక్టర్ పి.ఎం.భార్గవ రసాయన శాస్త్రంలో పిహెచ్.డి. చేసి అనంతర కాలంలో జీవ శాస్త్రం వైపు అడుగులేశారు.
ఈ ముగ్గురూ పద్మభూషణ్ గ్రహీతలు కాగా డాక్టర్ పి.ఎం.భార్గవ ఆ పౌర పురస్కారాన్ని ప్రభుత్వ విధానాలకు నిరసనగా తిరిగి ఇచ్చేశారు. మిగతా ఇద్దరూ పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా పొందారు.
వీరు ముగ్గురూ విద్యారంగంలో అసమాన కృషి చేశారు. అహ్మదాబాద్ లోనూ అమెరికాలోనూ బోధనావృత్తి నిర్వర్తించారు యు.ఆర్.రావు. లక్నో లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థకు ఛాన్సలర్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా యశ్ పాల్ పనిచేశారు. విశ్వవిద్యాలయాల నిధుల సంఘానికి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. జాతీయ పాఠ్య ప్రణాళికా చట్ర రూపకల్పన కమిటీ అధ్యక్షునిగా, విద్యారంగ సంస్కరణల కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. డాక్టర్ పి.ఎం.భార్గవ మొదట్లో బోధనా వృత్తిలో పనిచేశారు. విద్యారంగంలో అనేక కీలక ప్రతిపాదనలు చేసిన జాతీయ విజ్ఞాన కమిషన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

భారత దేశ తొలి కృతిమ ఉపగ్రహం ఆర్యభట్టతో సహా 19 కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగాలకు నాయకత్వం వహించారు ఆచార్య యు.ఆర్.రావు. ‘ప్రసార భారతి’ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. దేశంలో టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆయనే కారణం. చదువుల భారాన్ని తగ్గించాలని కీలక సిఫారసు చేసిన కమిటీకి అధ్యక్షుడు యశ్ పాల్. ప్రణాళికాసంఘంతో సహా అనేక సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థను స్థాపించి వ్యవస్థాపక సంచాలకులుగా పనిచేశారు పి.ఎం.భార్గవ. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా యశ్ పాల్, భార్గవ తీవ్రంగా కృషి చేశారు. మతపరమైన ఆచారాల్లో శాస్త్రీయత లేదని పేర్కొన్నారు యశ్ పాల్. భార్గవ అభిప్రాయమూ అదే. హైదరాబాద్ లో ఉబ్బసానికి ఇచ్చే చేప మందు శాస్త్రీయతని ప్రశ్నించారు భార్గవ. విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యాన్ని ప్రవేశ పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేశారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేసేందుకు ఆయన పోషించిన పాత్ర ప్రశంసనీయం. దేశంలో ఆధునిక జీవశాస్త్ర నిర్మాతగా ఆయన కీర్తి ఎప్పుడూ నిలిచి ఉంటుంది.
భారత వైజ్ఞానిక రంగానికి నిరుపమాన సేవ చేసిన ఈ ముగ్గురూ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. 
                            -   డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు

Saturday 22 July 2017

దాశరథి సాహిత్యం సజీవం


           - డా. రాయారావు సూర్య ప్రకాశ్ రావు

ఒకే వాక్యం – ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’. తెలంగాణ ఘన చరిత నినాదంగా రూపొందిన వాక్యం. మరో వాక్యం – ‘మా నిజాము రాజు, జన్మ జన్మాల బూజు’. నిజాం వ్యతిరేక రణన్నినాదం. ఇంకో వాక్యం- ‘అనాదిగా సాగుతోంది సంగ్రామం – అనాథునికి, ఆగర్భ శ్రీమంతునికీ’. వర్గ పోరాటానికి దర్పణం పట్టే వాక్యం. ఒక్కో వాక్యంతో ఒక్కో కావ్య సృజనకు సరిసమానమైన ఘనత సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి మహా కవి దాశరథి కృష్ణమాచార్యులు.
మధ్యాహ్న మార్తాండుని ఉష్ణ ప్రతాపం, పున్నమి చంద్రుని వెన్నెల చల్లదనం కలగలిస్తే అచ్చం దాశరథి కృష్ణమాచార్యుల సాహిత్యం లాగానే ఉంటుంది. “ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని’ అని నిజాంకు వ్యతిరేకంగా పోరాట బావుటా ఎగరేసినపుడు ఎంత తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శించారో “ఖుషీ ఖుషీగా నవ్వుతూ – చలాకి మాటలు రువ్వుతూ – హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా!” అన్నప్పుడు అంతే తీవ్రమైన భావావేశాన్ని రంగరించారు. సాంప్రదాయత, ఆధునికత కలగలిసిన సాహిత్య స్వరూపం దాశరథి. “అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో” అని ఆకలితో అలమటించే సమాజం ఉండకూడదని  ఎంత ఆవేదనతో పలవరించారో, “రారా కృష్ణయ్యా... రారా కృష్ణయ్యా.. దీనులను కాపాడ రారా కృష్ణయ్యా” అంటూ అంతే ఆర్ద్రతతో ఈ బాధలను దూరం చేసేందుకు రమ్మని కృష్ణుడిని ఆహ్వానించారు.
1925 జూలై 22న నేటి మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు గ్రామంలో వెంకటమ్మ, వేంకటాచార్యులు అనే దంపతులకు మొదటి సంతానంగా దాశరథి జన్మించారు. స్వగ్రామంలోనే నాలుగో తరగతి చదువుకున్నారు. ఆ తర్వాత ఖమ్మంలోని ఉస్మానియా ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. స్వాతంత్ర్య సమరం వల్ల మెట్రిక్యులేషన్ తోనే ఆయన చదువు ఆగిపోయింది. ఆ తర్వాత చాలాకాలానికి 1949లో ప్రైవేటుగా ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1952లో ఆంగ్ల సాహిత్యం ఐఛ్చికంగా డిగ్రీ చేశారు.
మొదట్లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేసిన దాశరథి అనంతరం గ్రామ పంచాయితీ తనిఖీ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత 1956 నుండి 1963 వరకు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో సహాయ ప్రయోక్తగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో పనిచేసి 1970లో రాజీనామా చేశారు.
ఉద్యమాల్లో క్రియాశీల భూమిక నిర్వర్తించారు దాశరథి. నాటి నిజాం ప్రభుత్వం ఆయనను ఖైదు చేసి, కారాగారంలో ఉంచింది. అయినా ఆయన జడుసుకోలేదు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైలు గోడల పైనే పద్యాలు రచించారు. తన ఉపన్యాసాలతో ప్రజల్లో నిజాం వ్యతిరేక భావనలను ప్రేరేపించారు. ఆంద్ర సారస్వత పరిషత్తు స్థాపనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రచయితల సంఘాన్ని 1953లో స్థాపించారు.
పద్య గద్య ప్రక్రియల్లో అసమాన ప్రతిభ ప్రదర్శించారు దాశరథి. కథలు, కవితలు, నాటికలు, సినిమా పాటలు రాశారు. నవలలు, వ్యాసాలు, ముందుమాటలు, నిఘంటువులు, గేయాలు, బాల సాహిత్యం, జంట కవిత్వం, లేఖా సాహిత్యం, అనువాదం మొదలైన ప్రక్రియల్లో శ్లాఘనీయమైన కృషి చేశారు.
‘అగ్ని ధార’, ‘రుద్రవీణ’, ‘పూల పాటలు’, ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘అమృతాభిషేకము’, ‘మహాబోధి’ మొదలైన రచనలు చేశారు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్లను ‘గాలిబ్ గీతాలు’ పేరిట తెలుగులోకి అనువదించారు. తాను ఉద్యమంలోకి ప్రవేశించిన నాటి నుండి విశాలాంధ్ర అవతరణ వరకు తన అనుభవాలను డెబ్బై వారాలపాటు ‘యాత్రాస్మృతి’ పేరిట అందించారు.
భద్రాచల రామదాసు రచించిన ‘దాశరథి శతకం’లో ఉపయోగించిన ‘దాశరథీ! కరుణాపయోనిధీ!’ అనే మకుటాన్ని ఉపయోగించి ‘అభినవ దాశరథి శతకం’ రచించారు దాశరథి. కంచెర్ల గోపన్న రచించిన ‘దాశరథి శతకం’ భక్తి రస ప్రధానమైనది కాగా దాశరథి రచించిన ‘అభినవ దాశరథి శతకం’ సమకాలీన రాజకీయ, సాంఘిక, సాహిత్య రంగాల అధిక్షేపాత్మక, వ్యంగ్యాత్మక విశ్లేషణ.
రేడియో మాధ్యమంగా దాశరథి ‘మహా పరినిర్వాణము’, ‘తెలంగాణ’, ‘ఏకశిల’, ‘హోళీ’, ‘యశోధర’, ‘గోల్కొండ’ తదితర నాటికలను రాశారు. ‘నవమి’ అనే పేరుతో ఆయన రచించిన నాటికల్లో తొమ్మిది ప్రచురితమయ్యాయి. ‘పూచిన మోడుగులు’, ‘రక్తాంజలి’, ‘నిప్పు పూలు’, ‘వెన్నెల్లో చీకటి’ మొదలైన కథలను ఆయన రచించారు. ‘మహాశిల్పి జక్కన’ అనే చారిత్రాత్మక నవలికను కూడా ఆయన రాశారు. సుప్రసిద్ధ హిందీ రచయిత ఆరిగపూడి రమేశ్ చౌదరి రచించిన ‘ఝాడ్ ఫానూస్’ అనే హిందీ నవలను ‘అద్దాల మేడ’ పేరుతో అనువదించారు. ‘భారతంలోని ఉపాఖ్యానాలు’ పురాణేతిహాసాలపై దాశరథికి ఉన్న సమగ్ర అవగాహనకు ఒక నిదర్శనం.
1961లో ‘వాగ్దానం’, ‘ఇద్దరు మిత్రులు’ చిత్రాలతో చలన చిత్ర రంగ ప్రవేశం చేసి, దాదాపు రెండు దశాబ్దాల కాలం చలన చిత్రాలకు వందలాది పాటలు రాశారు. ‘రంగుల రాట్నం’ చిత్రంలోని ‘నడిరేయి ఏ జాములో’, ‘బుద్ధిమంతుడు’ చిత్రంలోని ‘నను పాలింపగ నడచి వచ్చితివా’, ‘మేన కోడలు’ చిత్రంలోని ‘తిరుమల మందిర సుందరా’, ‘మంచి మనిషి’ చిత్రంలోని ‘ఓహో గులాబి బాలా’, ‘లక్ష్మీ నివాసం’ చిత్రంలోని ‘ధనమేరా అన్నిటికీ మూలం’, ‘మూగ మనసులు’ చిత్రంలోని ‘గోదారి గట్టుంది.. గట్టు మీద చెట్టుంది’ మొదలైన అనేక పాటలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యం చేస్తుంటాయి.
‘మంజీర’, ‘స్రవంతి’ పత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు దాశరథి. ‘బాల సరస్వతి తెలుగు- ఇంగ్లీషు నిఘంటువు’ కర్తల్లో ఆయన కూడా ఒకరు. పింగళి- కాటూరి సాహిత్య పీఠానికి కులపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలకు గౌరవ ప్రయోక్తగా పనిచేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర, మధుర, అన్నామలై విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి, ఫిలిం సర్టిఫికేషన్ బోర్డుకు, కేంద్ర సాహిత్య అకాడమీకి, సెంట్రల్ పబ్లికేషన్స్ డివిజన్ కు సభ్యులుగా దాశరథి పనిచేశారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆస్థాన కవిగా నియమించింది. ఆ పదవిలో 1977 నుండి 1983 వరకు పనిచేశారు. ‘కవితా పుష్పకం’ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్  సాహిత్య అకాడమీ పురస్కారం, ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. మీర్జా గాలిబ్ గజళ్ల అనువాదం ‘గాలిబ్ గీతాలు’ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అనువాద పురస్కారం పొందింది.
‘మహాకవి’, ‘అభ్యుదయ కవి చక్రవర్తి’, ‘యువకవి చక్రవర్తి’ అనే బిరుదాలను పొందారు దాశరథి. కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘జాతీయోద్యమ రథసారథి’గా గుర్తించింది. ఇందిరాగాంధీ చేతులమీదుగా ఆయన సన్మానం పొందారు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను ‘కళా ప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది. 1976లో ఆగ్రా విశ్వవిద్యాలయం, 1981లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) గౌరవ పట్టాతో సన్మానించాయి. 1978లో ‘అమెరికా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ’ ఆయనను ‘ఆంధ్ర కవితా సారథి’ అనే బిరుదుతో గౌరవించింది.
1971లో జరిగిన ఒంగోలు జిల్లా రచయితల మహాసభల్లో దాశరథి ఎడమ కాలికి అప్పటి రాష్ట్ర మంత్రి నారపరెడ్డి స్వయంగా గండపెండేరాన్ని తొడిగారు. 1975లో దాశరథికి యాభయ్యేళ్లు నిండిన సందర్భంగా అప్పటి ఉప రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ విజయవాడలో ఆయనను ఘనంగా సత్కరించారు. గజల్, రుబాయీ ప్రక్రియలను వివిధ భాషల్లో అధ్యయనం చేసేందుకు నాటి కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆయనకు సీనియర్ ఫెలోషిప్ ను ఇచ్చింది.  
పలు దేశాల్లో దాశరథి పర్యటించారు. మలేషియా, సింగపూర్, ఇంగ్లాండు, అమెరికా, కెనడా, మెక్సికో, జర్మనీ, ఫ్రాన్సు, బంగ్లాదేశ్, రష్యా తదితర దేశాల్లో వివిధ సభల్లో పాల్గొని, తన వాణిని వినిపించారు. ఆయా దేశాల విశేషాలతో పలు వ్యాసాలు రచించారు. ‘విపులాచ పృథ్వీ’, ‘అమెరికా దర్శనం’, ‘మలయ భాషా స్వరూప స్వభావాలు’ తదితర రచనల్లో ఆయన యాత్రావిశేషాలు కనిపిస్తాయి.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన ప్రతిభను ప్రదర్శించిన దాశరథి కృష్ణమాచార్యుల సాహిత్యం ‘దిక్కులేని పేదవాళ్ల డొక్కలలో పిక్కటిల్లు ఆకలిమంటలు’ ఉన్నంతకాలం సజీవంగా ఉంటుంది. ‘కాంతిని కనబడనివ్వని గాడాంధకారాల మీద శాంతిని వినబడనివ్వని రణ ఘీంకారాల మీద ధ్వజమెత్తిన ప్రజ’ కు అండగా వెలుతురు వెదజల్లుతూనే ఉంటుంది.







Thursday 13 July 2017

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో విధుల్లో చేరిన సురేశ్ కుమార్ గారు



ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్ళిన సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి ఎస్. సురేశ్ కుమార్  గారు కేంద్ర ప్రభుత్వంలో తిరిగి విధుల్లో చేరారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేబినేట్ మంత్రికి ఆంతరంగిక కార్యదర్శిగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టారు.
  విధి నిర్వహణలో అత్యంత సమర్థుడిగా పేరు తెచ్చుకున్న సురేశ్ కుమార్ గారు 2000 సంవత్సరం  ఐ.ఎ.ఎస్. బ్యాచుకు చెందినవారు. ఆయన 1972 మే  25 న జన్మించారు. ఫారెస్ట్రీలో డిగ్రీ చేశారు. సిల్వి కల్చర్ లో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. 2002లో తూర్పు గోదావరి జిల్లాలో అసిస్టెంటు కలెక్టరుగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన 2003 వరకు అదే హోదాలో అక్కడే పనిచేశారు. అనంతరం అదే జిల్లాలో 2004 జనవరి నుండి జూన్ వరకు సబ్ కలెక్టరుగా పనిచేశారు. ఆ తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో భద్రాచలం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారిగా ఎడాదిన్నరపాటు పనిచేశారు. ఆ కాలంలో గిరిజనాభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టరుగా 2008 మార్చి వరకు పనిచేసిన ఆయన అనంతరం 2010 వరకు చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టరుగా విధులు నిర్వర్తించారు.





  ఆ తర్వాత మెదక్ జిల్లా కలెక్టరుగా ఎస్. సురేశ్ కుమార్ గారు 2010 ఏప్రిల్ 12న బాధ్యతలు చేపట్టారు. మెదక్ జిల్లాలో పనిచేసిన కాలంలో అన్నివర్గాల ప్రజల మన్ననలు పొందారు. విద్య, వైద్య రంగాల్లో తనదైన ముద్ర వేశారు. వివిధ శాఖల సమన్వయంతో బడి బయటి పిల్లలను బడులలో చేర్చే ఆశయంతో ఒక రోడ్ మ్యాప్ రూపొందించారు. బాలల దినోత్సవమైన నవంబరు 14ను ఈ ఆశయ సాధనకు ఒక సందర్భంగా నిర్ణయించారు. ఎన్నడూ లేనంత ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించి, ఆ ఆశయ సాధనకు శ్రీకారం చుట్టారు. అనంతరం వయోజన విద్యాశాఖ, రాజీవ్ విద్యా మిషన్, యూనిసెఫ్, కార్మిక శాఖ, జాతీయ బాలకార్మిక ప్రాజెక్టులను సమన్వయ పరిచి సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటర్లు, ఎం.ఆర్.పి.ల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో గ్రామ సమన్వయకర్తలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో బడి బయటి పిల్లల గుర్తింపు కోసం సర్వే చేపట్టారు.

  ఎంతోకాలంగా మెదక్ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న సమీకృత కలెక్టరేటును అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు చొరవ చూపారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ‘పరిష్కారం’ సెల్ ప్రారంభించారు. బాలకార్మిక సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఆవిష్కరించారు. ఉద్యోగ మేళా ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు. రైతులకు 640 కోట్ల రూపాయల మేర రుణాలను రుణ మేళాల్లో అందజేశారు. విద్యారంగంలో ఉత్తమ ఫలితాల సాధన కోసం ‘సంపూర్ణ విద్యాదర్శిని’ అనే పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి, సమర్థవంతంగా అమలు చేశారు. ఈ ప్రాజెక్టుతో సహా పలు ఇ-గవర్నన్స్ ప్రాజెక్టులను అమలు చేసినందుకు గుంటూరులో పనిచేసే కాలంలో ఆయన కేంద్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు.


  మెదక్ జిల్లా తర్వాత 2012 జూలైలో కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన గుంటూరు జిల్లాలోనూ అదే ఒరవడి కొనసాగించారు. పారిశుధ్య కార్యక్రమాలపై గుంటూరులో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రశంసలందుకున్నారు. ‘స్వచ్ఛ గుంటూరు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేశారు. మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగులో పట్టు సాధించారు. అధికార భాషగా తెలుగు అమలులో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రభుత్వ పురస్కారం స్వీకరించారు. మీ-సేవ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం పొందారు. గుంటూరులో  కలెక్టరుగా ఉన్న కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని సమర్థవంతంగా నిర్వహించి, పలువురు ప్రముఖుల అభినందనలందుకున్నారు.



  అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేబినేట్ మంత్రికి ఆంతరంగిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సురేశ్ కుమార్ గారు కేంద్రం లోనూ తనదైన ముద్ర వేశారు. పట్టణాభివృద్ధి శాఖలో కీలక భూమిక నిర్వర్తించారు. విశ్వ విఖ్యాత డ్యూక్ విశ్వవిద్యాలయంలోని సాన్ ఫర్డ్  స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ లో అంతర్జాతీయ అభివృద్ధి విధానంలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు గత సంవత్సరం అమెరికా వెళ్ళారు. ఈ సంవత్సరం మే 14న డ్యూక్ విశ్వవిద్యాలయం నుండి  స్నాతకోత్తర పట్టా స్వీకరించారు. తిరిగి వచ్చిన అనంతరం తిరిగి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేబినేట్ మంత్రికి ఆంతరంగిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అమెరికాలో పొందిన విద్యాపరమైన పరిజ్ఞానం, అనుభవం  తోడ్పాటుతో పట్టణాభివృద్ధి శాఖను ప్రగతి మార్గంలో పరుగు పెట్టిస్తారని, దేశాభివృద్ధి కోసం కొత్త పథకాల అమలుకు బాటలు వేస్తారని ఆకాంక్షిద్దాం.