పిల్లల పెంపకంలో లోటుపాట్లను సరిదిద్దే ‘డాక్టర్ చెప్పిన కథలు’
-డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు,
9441046839
పిల్లల పెంపకం కత్తి మీద సాములాంటిది. ఎప్పుడు ఏ సమస్య ముంచుకొస్తుందో తెలియదు. పిల్లలు ఉన్నట్టుండి ముక్కులో ఏదో వస్తువు పెట్టుకుంటారు. చేతికందిన వస్తువును నోట్లో పెట్టుకుంటారు. ఆడుతూ పాడుతూ జారిపడతారు. ప్రమాదకరమైన వస్తువులతోనూ ఆటలాడతారు. ఈ కాలం న్యూక్లియర్ కుటుంబాల్లో పిల్లలను అనుక్షణం కనిపెట్టి ఉండడం కష్టం. అందుకే సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో తల్లిదండ్రులకు చెప్పేవారు కావాలి. ఈ బాధ్యతను ఓపికగా తలకెత్తుకున్నారు ప్రముఖ రచయిత్రి డా. కందేపి రాణీప్రసాద్. పిల్లల పెంపకంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలను ‘డాక్టర్ చెప్పిన కథలు’ అనే గ్రంథంలో వివరించారు. ఆయా అంశాలను అందరికీ అర్థమయ్యేలా కథల రూపంలో చెప్పడం విశేషం.
విజ్ఞాన శాస్త్రంపై పిల్లలకు మక్కువ కలిగేందుకు కృషి చేస్తున్న అతి కొద్దిమంది బాల సాహితీవేత్తల్లో ముందువరుసలో ఉండేవారు డా. కందేపి రాణీప్రసాద్. విజ్ఞానశాస్త్ర అంశాలతో ‘సైన్స్ పాయింట్’, ‘సైన్స్ వరల్డ్’, ‘సైన్స్ కార్నర్’ మొదలైన గ్రంథాలను వెలువరించారు. ‘మిఠాయి పొట్లం’ అనే పేరుతో మానవ శరీర భాగాలపై ఆసక్తి కలిగించే రీతిలో పొదుపుకథలను పుస్తకరూపంలో తెచ్చారు. కూరగాయల్లోని పోషక పదార్థాలను తెలియజేయడంతో పాటు వాటితో బొమ్మలు ఎలా రూపొందించవచ్చో ‘బొటానికల్ జూ’ అనే గ్రంథం ద్వారా తెలియజేశారు. నలభైకి పైగా పుస్తకాలను వెలువరించిన ఆమె తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు పలు ప్రముఖ సంస్థల పురస్కారాలను పొందారు. పిల్లల సైన్స్ రచనలపై డాక్టరేటు పొందిన డా. రాణీప్రసాద్ సిరిసిల్లలో సృజన్ పిల్లల ఆసుపత్రికి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
గతంలో తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలను ఎప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండేవారు. పిల్లల పెంపకంలో జరిగే పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిచేసేవారు. ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరు పిల్లల అలవాట్లను సరిదిద్దేవారు. చుట్టుపక్కల వారితో కలిసిమెలసి ఉండడం వల్ల సామాజిక నియమాలు, జీవన నైపుణ్యాలు చక్కగా అబ్బేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు దూరమై, ఇరుగుపొరుగు వారితోనూ పరిఛాయాలు మృగ్యమైన ఆధునికకాలంలో చెప్పేవారు లేరు. సరిదిద్దేవారు లేరు. చెప్పినా ఆచరించేవారు లేరు. ఈ లోటును దూరం చేసే ‘డాక్టర్ చెప్పిన కథలు’ కథాసంపుటి దైనందిన జీవితంలో పిల్లలకు ఎదురయ్యే వివిధ సమస్యలకు కథారూపంలో పరిష్కారాలను సూచిస్తుంది. పొరపాట్లు చేయకుండా నిలువరిస్తుంది. ఇందులో పాతిక కథలున్నాయి. ఇవన్నీ ప్రమాదాలు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త పడేందుకు ఉపకరిస్తాయి. ఇందులో ప్రతి కథా తల్లిదండ్రులకు ఒక చక్కటి సందేశాన్ని ఇస్తుంది. నిర్లక్ష్యం, అలవాట్లు, పొరపాట్లు, మూఢ నమ్మకాలు, సామాజిక నియమాల ఉల్లంఘన, జీవన నైపుణ్యాల లేమి అనే ఆరు విభాగాలుగా ఈ కథావస్తువులను విభజించవచ్చు.
తల్లిదండ్రుల నిర్లక్ష్యం చిన్న ప్రమాదాల తీవ్రతను పెంచి ప్రాణాల మీదికి తెస్తుంది. పిల్లలు ఏదన్నా మింగితే అది మోషన్ ద్వారా బయటికి వచ్చేస్తుందని చాలా మంది తల్లిదండ్రుల నమ్మకం. ‘స్క్రూ మింగితే’ అనే కథలో కూడా తల్లిదండ్రులు అలాగే భావిస్తారు. తమ బాబు స్క్రూ మింగిన మూడు రోజుల దాకా ఆసుపత్రి గడప తొక్కరు. ఆ స్క్రూ పేగుల్లోకి చొచ్చుకుపోయిందని ఎక్స్ రేలో బయటపడుతుంది. మూడు రోజుల దాకా ఆసుపత్రికి తీసుకురాని తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ఆపరేషన్ చేసి, స్క్రూని బయటికి తీయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల్లో నులిపురుగుల ద్వారా ఏర్పడే కడుపునొప్పిని ఎలా దూరం చేయవచ్చో చెప్పే కథ ‘కడుపునొప్పి’. మొక్కజొన్న కంకి విత్తు గొంతులో అడ్డం పడడం వల్ల చిన్నారి ప్రాణం పోయిన సంఘటనను ‘విత్తు మింగితే’ అనే కథ వివరిస్తుంది. కుక్క కాటుకు ఆధునిక చికిత్సను వివరించే కథ ‘కుక్క కరిస్తే’. వంట చేసేటప్పుడు తల్లి నిర్లక్ష్యం వల్ల పిల్లలు నూనెలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాలను వివరించే కథ ‘కాలే నూనెలో పడితే’.
కొన్ని అలవాట్లు పిల్లలకు హాని చేస్తాయి. అలాంటి అలవాట్లను దూరం చేయాలి. బలపాలు, మట్టి తినడం; అగ్గిపుల్లల్లాంటి వస్తువులతో చెవిలో గులిమి తీసేయడం; చాక్లెట్లు మొదలైనవి అతిగా తినడం మొదలైన అలవాట్లు పిల్లల్లో ఎలాంటి సమస్యలకు దారి తీస్తాయో చెప్పే కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. పిల్లలకు మద్యం అలవాటు చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించే కథ ‘కల్లు తాగిస్తే’.
పొరపాట్లు కూడా కొన్ని సందర్భాల్లో ప్రాణం పోవడానికి కారణం అవుతాయి. బిడ్డ తల కింద ఎత్తు పెట్టకుండానో, బిడ్డకు ఆకలవుతుందన్న హడావిడిలోనో తల్లులు ఒక్కోసారి బిడ్డకు పాలిస్తుంటారు. అవి గొంతులోకి వెళ్ళకుండా ముక్కులోకి, తర్వాత ఊపిరితిత్తులలోకి వెళ్ళి మరణం సంభవిస్తుంది. అలా తల్లి పట్టిన పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల బిడ్డ మరణించిన సంఘటనను చెప్పే కథ ‘పాలు పడితే’. పొరపాటున వేడి నీళ్ల దగ్గర పిల్లలను ఉంచితే జరిగే ప్రమాదాన్ని ‘వేడి నీళ్లు పడితే’ కథ వివరిస్తుంది. పాము కాటు సందర్భంలో గ్రామీణుల త్వరిత చర్యలను ప్రశంసించే కథ ‘పాము కాటేస్తే’. పిల్లలు పొరపాటుగా కార్లో చిక్కుకుపోవడం వల్ల కలిగే ఇబ్బందులను ‘కార్ లాక్ అయిపోతే’ కథ వివరిస్తుంది. పిల్లలు ఒక్కోసారి ప్లగ్ లో వేలు పెడతారు. నీళ్ల బక్కెట్లో పడిపోతారు. కిరోసిన్ వంటి ద్రవాలు తాగుతారు. మేడపై నుండి జారి పడతారు. ముక్కులో ఏవో వస్తువులు పెట్టుకుంటారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపే కథలు కూడా ఇందులో ఉన్నాయి.
మూఢ నమ్మకాలతో వ్యవహరించే జనం తమ అభిప్రాయమే సరైందని భావిస్తుంటారు. అలాంటి వారి మూఢ నమ్మకాలను దూరం చేసే లక్ష్యంతో రాసిన కథలు కూడా ఈ కథాసంపుటిలో ఉన్నాయి. ఫిట్స్ వచ్చినప్పుడు చుట్టతో కాల్చి నుదుటిపై వాత పెట్టడం పరిష్కారమని కొంతమంది ఇప్పటికీ భావిస్తుంటారు. ఆ అభిప్రాయం తప్పని చెప్పే కథ ‘ఫిట్స్ వస్తే’. వైరస్ వల్ల వచ్చే చికెన్ పాక్స్ కు తప్పకుండా మందులు వాడాలని చెప్పే కథ ‘పోశమ్మ తల్లి’.
పిల్లల మధ్య ఎడం లేకపోవడం వల్ల పిల్లల పెంపకంలో ఏర్పడే ఇబ్బందులను తెలిపే కథ ‘ఇద్దరి మధ్య ఎడం లేకపోతే’.
జీవన నైపుణ్యాలు పిల్లల్లో అలవర్చడంలో తల్లిదండ్రులదే కీలక బాధ్యత. రోడ్డుపై నడిచేప్పుడు వ్యవహరించే తీరు, దీపావళికి టపాకాయలు కాల్చేప్పుడు జాగ్రత్తగా ఉండడం, మైనర్ పిల్లలు వాహనం నడపకూడదన్న నియమం ఉల్లంఘించడం మొదలైన సందర్భాలను తెలిపే కథలు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి. ఆయా సందర్భాల్లో పిల్లలు వ్యవహరించవలసిన విధానాలను ఈ కథలు తెలియజేస్తాయి.
ఇవన్నీ చిన్న చిన్న కథలే అయినప్పటికీ మనం రోజూ చూసే వ్యక్తులనే పాత్రలుగా మలిచారు. పిల్లలను ఎత్తుకుని స్విచ్ బోర్డులతో ఆటలాడే ప్రణీతలు, ఫోన్లు మాట్లాడుతూ పిల్లలెక్కడున్నారో గమనించని నరేషులు, పిల్లాడికి కుక్క కరిచినా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి తాత్సారం చేసే రాజేషులు మనకు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటారు.
రచయిత్రి డా. కందేపి రాణీప్రసాద్ భర్త డా. ప్రసాద్ రావు కూడా ఈ కథల్లో ఒక పాత్రగా కనిపిస్తారు. అనేక విషయాల్లో పిల్లల తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం వహిస్తారు. కవర్ పేజీపై కూడా ఆయన సహజ చిత్రమే ఉండడం మరో విశేషం. బాల్యంలో గౌను వేసుకున్న ఈ దంపతుల బాబును డాక్టర్ గారు స్టెతస్కోప్ తో పరీక్షిస్తున్నట్టున్న కవర్ పేజీ రూపొందించిన చిత్రకారులు టి. శివాజీ అభినందనీయులు.
ఈ కథలన్నీ చక్కటి భాషతో, ఆకట్టుకునే శైలితో సాగుతాయి. అందుకే పాఠకుడిని విడవకుండా చదివిస్తాయి. బాలల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చదవవలసిన గ్రంథమిది. పిల్లల పెంపకంలో లోటుపాట్లను సరిదిద్దే కథా సంపుటి ‘డాక్టర్ చెప్పిన కథలు’.
(డాక్టర్ చెప్పిన కథలు, రచయిత్రి: డా. కందేపి రాణీప్రసాద్. వెల: రూ.100, ప్రతులకు: రచయిత్రి, ఫోన్ నెంబర్: 9866160378)
(2023 ఆగస్టు 21 'ఆంధ్రప్రభ' దినపత్రిక 'సాహితీ గవాక్షం' పేజీలో ప్రచురితం)