Tuesday, 2 June 2020

ప్రయోగశాల కరదీపిక తయారీ నుండి ప్రయోగ నిర్వహణ దాకా...


Why should women have all the fun?
లాక్ డౌన్ ఘుమఘుమలు -2
ప్రయోగశాల కరదీపిక తయారీ నుండి ప్రయోగ నిర్వహణ దాకా...

జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో దక్షిణ భారత దేశ స్థాయి ప్రయోగశాల కరదీపిక రూపకల్పన కోసం కార్యశాలను ఆ మధ్య నిర్వహించింది. మైసూరులోని ప్రాంతీయ విద్యా కళాశాల లో ఆ కార్యశాల జరిగింది. వెళ్ళింది ప్రయోగశాల కరదీపిక తయారీ కోసం.. ప్రయోగాలు చేయకుండా ఊర్కోలేం.. పైగా తిరిగే కాలు, తినే నోరు కుదురుగా ఉండవంటారు గదా!  మైసూరులో చాముండి హిల్స్ కు వెళ్ళాం. చాముండేశ్వరి దేవాలయం చూశాం. మహారాజా ప్యాలెస్ లో వడయార్ల వైభోగాన్ని అనుభూతి చెందాం. బృందావన్ గార్డెన్స్ లో విహరించాం. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ కు వెళ్ళాం. తెలుగేతర ప్రాంతాల విద్యార్థులు అక్కడ తెలుగు అభ్యసించే తీరుకు ముగ్ధులమయ్యాం.

అలా సాయంత్రాలు మైసూరు నగరంలో జరిపిన పర్యటనల్లో ఒకరోజు బస్సులో నుండి దృశ్యాలను చూస్తూ మైమరిచి పోయాం. చాలా దూరం వెళ్ళాక కండక్టర్ ను అడిగితే తెలిసిన విషయం ఏంటంటే మేం దిగాల్సిన స్టేజి దాటి చాలా సేపయిందని. అక్కడే బస్సు ఆపించుకుని, దిగి, పదకొండో నెంబరు బస్సును (అంటే కాలుకు బహువచనం అని శరీర నిర్మాణ శాస్త్రం చెప్తోంది) ఆశ్రయించి, రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు వచ్చి పడ్డాం.

ఆ రోజుల్లోనే మైసూరు పేరు మీదుగా ఉండే పాకం గానీ, బజ్జీ గానీ రుచి చూడాలని మా మనసులు కోరుకున్నాయి. అలా మనసు నుండి ఆదేశాలు నాలుకకు వెళ్ళాయి. నాలుక ప్రేరేపించడంతో కొన్ని జతల కాళ్ళు మహారాజా ప్యాలెస్ దగ్గర ఒక హోటల్ వైపు దారితీశాయి. 'ఏమున్నాయి?' అని అడగడం ఆలస్యం అక్కడి సర్వర్ ఇచ్చిన జవాబు శతాబ్ది ఎక్స్ ప్రెస్ ను గుర్తుకు తెచ్చింది. ఫుల్ స్టాపులు, కామాలు లేకుండా అతనిచ్చిన సమాధానంలో ఒక్క ఐటం కూడా అర్థం కాలేదు. మళ్ళీ అడిగితే మళ్ళీ అదే వేగం. ఈసారి కాస్త జాగ్రత్తగా విన్నాం. కానీ ఏ ఒక్క ఐటం లోనూ మైసూర్ అనే పేరున్నట్టు వినబడలేదు. అందుకే ఇలా లాభం లేదని తీర్మానించుకుని నేరుగా అడిగేయడం ఉత్తమమని డిసైడ్ అయిపోయాం. 'మైసూర్ బజ్జీ ఉందా?' అని మా ప్రశ్న. 'ఈ మాత్రం దానికి అప్పుడే అడిగేయవచ్చు కదా' అని అతడి చూపుకు మనో విజ్ఞానశాస్త్రం ఇచ్చిన సొల్యూషన్. తన మనసు బయటపడకుండా వీలైనంత మర్యాదగా లేదని జవాబిచ్చాడు. అప్పటికే రెండుసార్లు ఏమున్నాయని అడిగేశాం. మరోసారి అడగడం పద్ధతి కాదని ఆగిపోయాం. ఈ సారి మరో రూట్ లో వచ్చి 'ఈ హోటల్ లో తయారు చేసే స్పెషల్ టిఫిన్స్ ఏంటి?' అని అడిగాం. అప్పుడతను ఇచ్చిన జవాబు 'మల్లిగె ఇడ్లీ' అని. ఆ సమాధానం నాకు ఇంకా బాగా గుర్తుంది. అతను కాసేపటికి వేడివేడిగా ఇచ్చిన ఇడ్లీ రుచి అంతకంటే బాగా మెదడు లోపలి పొరల్లో నిక్షిప్తమైంది. 'మల్లిగె' అంటే మల్లె పువ్వని తెలిసింది. మల్లెపువ్వులా చాలా మృదువుగా ఉన్న ఆ ఇడ్లీ మైసూరు పేరు వినగానే నాకు గుర్తొచ్చే జ్ఞాపకాల్లో ఒకటి.

ఎండాకాలం అంటే మండేకాలమే కాదు, మల్లెల కాలం కూడా. అందుకే ఈ లాక్ డౌన్ కాలంలో మే నెల చివరి రోజు 'మల్లిగె ఇడ్లీ' గుర్తొచ్చింది. మరోసారి ఆ రుచిని ఆస్వాదించాలనిపించింది. మరో సందర్భం అయితే అలా అనిపించినపుడు కాలికి పని చెప్తాం. కానీ లాక్ డౌన్ వల్ల ఈ సారి చేతికి పని చెప్పాను. గూగుల్ తల్లిని మనసులో ధ్యానించి, కరుణా కటాక్ష వీక్షణాలు కురిపించమని యూ ట్యూబ్ ను వేడుకుంటే 'మల్లిగె ఇడ్లీ' చేసే విధానం చూడగలిగాను. ఇంకేం..  కావలసినవన్నీ సిద్ధం చేసుకుని, తెలంగాణ అవతరణకు ముందు రోజు ... అంటే నిన్న .. ఒక పట్టు పట్టాను. మీరూ ఒకసారి టేస్ట్ చేయండి.

కావలసిన పదార్థాలు:
(15 ఇడ్లీల తయారీ కోసం)
1. మినపపప్పు- ఒక కప్పు 2. అటుకులు- 1 కప్పు 3. ఇడ్లీ తయారీకి వాడే బియ్యం- రెండు కప్పులు. 4. తగినంత ఉప్పు.

తయారు చేసే పద్ధతి:
1. ఒక కప్పు మినప పప్పు, ఒక కప్పు అటుకులు ఒక గిన్నెలో నాలుగు గంటలపాటు నానబెట్టాలి. 2. మరో గిన్నెలో రెండు కప్పుల ఇడ్లీ బియ్యం నాలుగు గంటలపాటు నానబెట్టాలి. 3. నాలుగు గంటల తర్వాత ఈ రెండింటిని వేర్వేరుగా రుబ్బుకోవాలి. మినపపప్పు- అటుకుల మిశ్రమాన్ని మెత్తగా రుబ్బాలి. బియ్యాన్ని మాత్రం మరీ మెత్తగా రుబ్బకూడదు. 4. ఈ రెండింటినీ కలిపి, పది గంటలపాటు పులియబెట్టాలి. 5. ఇడ్లీ తయారు చేసేముందు ఈ మిశ్రమానికి ఉప్పు కలపాలి. 6. ఇడ్లీ పాత్రలకు కొద్దిగా నూనె రాసి, ఈ పిండి వేయాలి. 7. అలా 12 నిముషాల సేపు ఇడ్లీ కుక్కర్ లో ఆవిరిపై ఉడికించాలి.
8. ఇంకా చెప్పేదేముంది.. చెప్పకున్నా తినొచ్చు.

2 comments:

  1. బాగుంది.మొత్తంమీద లాక్ డౌన్ టైం బాగా పనికొచ్చింది వంటల వాడివయ్యావు. రేపు ఇంటికి వస్తే ఘుమఘుమలు,రుచులు పంచుతావ్..శుభాకాంక్షలు.. సూర్యా గుడ్..

    ReplyDelete
  2. Super ఇడ్లీ.. ఇది సూర్యా ఇడ్లీ.. వావ్ 👌

    ReplyDelete