ముగ్గురూ ముగ్గురే
శిఖర సమానులే
ఒకే పక్ష కాలంలో మరణించిన ఆ ముగ్గురూ భారత దేశ విజ్ఞానశాస్త్ర ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటిచెప్పారు. దేశానికి ప్రతినిధులుగా శాస్త్ర, సాంకేతిక, విద్యారంగాల్లో అసమాన ప్రతిభను ప్రదర్శించారు. భారత దేశ పౌర పురస్కారాలను అందుకున్న ఆ ముగ్గురు విశిష్ట సేవా మూర్తులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఆచార్య ఉడుపి రామచంద్ర రావు, విశ్వవిద్యాలయాల నిధుల సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఆచార్య యశ్ పాల్ సింగ్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ వ్యవస్థాపక సంచాలకులుగా పనిచేసిన డాక్టర్ పుష్పమిత్ర భార్గవ.
వీరిలో ఆచార్య యు.ఆర్.రావు దక్షిణభారతదేశానికి, ఆచార్య యశ్ పాల్ ఉత్తర భారతదేశానికి చెందినవారు. డాక్టర్ పి.ఎం.భార్గవ ఉత్తర, దక్షిణ భారతాలు రెంటితోనూ అవినాభావ సంబంధాలున్నవారు. కర్నాటక రాష్ట్రంలోని అడమారులో ఆచార్య యు.ఆర్. రావు 1932 మార్చి 10న జన్మించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న ఝాంగ్ లో 1926 నవంబరు 26న పుట్టారు ఆచార్య యశ్ పాల్. 1928 ఫిబ్రవరి 22 న రాజస్థాన్ లోని అజ్మీర్ లో జన్మించినా దక్షిణ భారతదేశంలోని హైదరాబాదులో స్థిరపడిపోయారు డాక్టర్ పి.ఎం.భార్గవ.
ఈ ముగ్గురిలో ఆచార్య యు.ఆర్.రావు, ఆచార్య యశ్ పాల్ భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ గ్రహీతలు కాగా డాక్టర్ పి.ఎం.భార్గవ రసాయన శాస్త్రంలో పిహెచ్.డి. చేసి అనంతర కాలంలో జీవ శాస్త్రం వైపు అడుగులేశారు.
ఈ ముగ్గురూ పద్మభూషణ్ గ్రహీతలు కాగా డాక్టర్ పి.ఎం.భార్గవ ఆ పౌర పురస్కారాన్ని ప్రభుత్వ విధానాలకు నిరసనగా తిరిగి ఇచ్చేశారు. మిగతా ఇద్దరూ పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా పొందారు.
వీరు ముగ్గురూ విద్యారంగంలో అసమాన కృషి చేశారు. అహ్మదాబాద్ లోనూ అమెరికాలోనూ బోధనావృత్తి నిర్వర్తించారు యు.ఆర్.రావు. లక్నో లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థకు ఛాన్సలర్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా యశ్ పాల్ పనిచేశారు. విశ్వవిద్యాలయాల నిధుల సంఘానికి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. జాతీయ పాఠ్య ప్రణాళికా చట్ర రూపకల్పన కమిటీ అధ్యక్షునిగా, విద్యారంగ సంస్కరణల కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. డాక్టర్ పి.ఎం.భార్గవ మొదట్లో బోధనా వృత్తిలో పనిచేశారు. విద్యారంగంలో అనేక కీలక ప్రతిపాదనలు చేసిన జాతీయ విజ్ఞాన కమిషన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.
భారత దేశ తొలి కృతిమ ఉపగ్రహం ఆర్యభట్టతో సహా 19 కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగాలకు నాయకత్వం వహించారు ఆచార్య యు.ఆర్.రావు. ‘ప్రసార భారతి’ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. దేశంలో టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆయనే కారణం. చదువుల భారాన్ని తగ్గించాలని కీలక సిఫారసు చేసిన కమిటీకి అధ్యక్షుడు యశ్ పాల్. ప్రణాళికాసంఘంతో సహా అనేక సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థను స్థాపించి వ్యవస్థాపక సంచాలకులుగా పనిచేశారు పి.ఎం.భార్గవ. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా యశ్ పాల్, భార్గవ తీవ్రంగా కృషి చేశారు. మతపరమైన ఆచారాల్లో శాస్త్రీయత లేదని పేర్కొన్నారు యశ్ పాల్. భార్గవ అభిప్రాయమూ అదే. హైదరాబాద్ లో ఉబ్బసానికి ఇచ్చే చేప మందు శాస్త్రీయతని ప్రశ్నించారు భార్గవ. విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యాన్ని ప్రవేశ పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేశారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేసేందుకు ఆయన పోషించిన పాత్ర ప్రశంసనీయం. దేశంలో ఆధునిక జీవశాస్త్ర నిర్మాతగా ఆయన కీర్తి ఎప్పుడూ నిలిచి ఉంటుంది.
భారత వైజ్ఞానిక రంగానికి నిరుపమాన సేవ చేసిన ఈ ముగ్గురూ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది.
- డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు
వ్యాసం చాలా చాలా బాగుంది సూర్య ప్రకాష్ గారూ👌👌👌
ReplyDeleteమీ అభిప్రాయానికి ధన్యవాదాలు...
Delete