ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం
అమెరికాకు వెళ్ళిన సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి ఎస్. సురేశ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వంలో తిరిగి విధుల్లో చేరారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేబినేట్ మంత్రికి ఆంతరంగిక కార్యదర్శిగా ఆయన తిరిగి బాధ్యతలు
చేపట్టారు.
విధి నిర్వహణలో అత్యంత సమర్థుడిగా
పేరు తెచ్చుకున్న సురేశ్ కుమార్ గారు 2000 సంవత్సరం ఐ.ఎ.ఎస్. బ్యాచుకు చెందినవారు. ఆయన 1972 మే
25 న జన్మించారు. ఫారెస్ట్రీలో డిగ్రీ చేశారు. సిల్వి కల్చర్ లో ఎమ్మెస్సీ
పూర్తిచేశారు. 2002లో తూర్పు గోదావరి జిల్లాలో అసిస్టెంటు కలెక్టరుగా
ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన 2003 వరకు అదే హోదాలో అక్కడే పనిచేశారు. అనంతరం
అదే జిల్లాలో 2004 జనవరి నుండి జూన్ వరకు సబ్ కలెక్టరుగా పనిచేశారు. ఆ తర్వాత
గిరిజన సంక్షేమ శాఖలో భద్రాచలం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారిగా ఎడాదిన్నరపాటు
పనిచేశారు. ఆ కాలంలో గిరిజనాభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు.
కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టరుగా 2008 మార్చి వరకు పనిచేసిన ఆయన అనంతరం 2010 వరకు
చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టరుగా విధులు నిర్వర్తించారు.
ఆ తర్వాత మెదక్ జిల్లా కలెక్టరుగా ఎస్. సురేశ్ కుమార్ గారు
2010 ఏప్రిల్ 12న బాధ్యతలు చేపట్టారు. మెదక్ జిల్లాలో పనిచేసిన కాలంలో అన్నివర్గాల
ప్రజల మన్ననలు పొందారు. విద్య, వైద్య రంగాల్లో తనదైన ముద్ర వేశారు. వివిధ శాఖల
సమన్వయంతో బడి బయటి పిల్లలను బడులలో చేర్చే ఆశయంతో ఒక రోడ్ మ్యాప్ రూపొందించారు.
బాలల దినోత్సవమైన నవంబరు 14ను ఈ ఆశయ సాధనకు ఒక సందర్భంగా నిర్ణయించారు. ఎన్నడూ
లేనంత ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించి, ఆ ఆశయ సాధనకు శ్రీకారం చుట్టారు.
అనంతరం వయోజన విద్యాశాఖ, రాజీవ్ విద్యా మిషన్, యూనిసెఫ్, కార్మిక శాఖ, జాతీయ
బాలకార్మిక ప్రాజెక్టులను సమన్వయ పరిచి సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటర్లకు శిక్షణ
కార్యక్రమాన్ని నిర్వహించారు. సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటర్లు, ఎం.ఆర్.పి.ల ఆధ్వర్యంలో
అన్ని మండలాల్లో గ్రామ సమన్వయకర్తలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. సాక్షర
భారత్ మండల కో-ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో బడి బయటి పిల్లల గుర్తింపు కోసం సర్వే
చేపట్టారు.
ఎంతోకాలంగా మెదక్ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న సమీకృత
కలెక్టరేటును అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు చొరవ
చూపారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ‘పరిష్కారం’ సెల్ ప్రారంభించారు.
బాలకార్మిక సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఆవిష్కరించారు. ఉద్యోగ మేళా
ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు. రైతులకు 640 కోట్ల రూపాయల
మేర రుణాలను రుణ మేళాల్లో అందజేశారు. విద్యారంగంలో ఉత్తమ ఫలితాల సాధన కోసం ‘సంపూర్ణ విద్యాదర్శిని’ అనే పేరిట
ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి, సమర్థవంతంగా అమలు చేశారు. ఈ ప్రాజెక్టుతో సహా
పలు ఇ-గవర్నన్స్ ప్రాజెక్టులను అమలు చేసినందుకు గుంటూరులో పనిచేసే కాలంలో ఆయన కేంద్ర
ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు.
మెదక్ జిల్లా తర్వాత 2012
జూలైలో కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన గుంటూరు జిల్లాలోనూ అదే ఒరవడి కొనసాగించారు. పారిశుధ్య
కార్యక్రమాలపై గుంటూరులో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రశంసలందుకున్నారు. ‘స్వచ్ఛ
గుంటూరు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేశారు. మాతృభాష మలయాళం అయినప్పటికీ
తెలుగులో పట్టు సాధించారు. అధికార భాషగా తెలుగు అమలులో రాష్ట్ర స్థాయిలో ప్రథమ
స్థానంలో నిలిచి ప్రభుత్వ పురస్కారం స్వీకరించారు. మీ-సేవ కార్యక్రమాలను
సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం పొందారు. గుంటూరులో కలెక్టరుగా ఉన్న కాలంలోనే ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని సమర్థవంతంగా నిర్వహించి,
పలువురు ప్రముఖుల అభినందనలందుకున్నారు.
అనంతరం కేంద్ర
పట్టణాభివృద్ధి శాఖ కేబినేట్ మంత్రికి ఆంతరంగిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన
సురేశ్ కుమార్ గారు కేంద్రం లోనూ తనదైన ముద్ర వేశారు. పట్టణాభివృద్ధి శాఖలో కీలక
భూమిక నిర్వర్తించారు. విశ్వ విఖ్యాత డ్యూక్ విశ్వవిద్యాలయంలోని సాన్ ఫర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ లో అంతర్జాతీయ
అభివృద్ధి విధానంలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు గత సంవత్సరం అమెరికా వెళ్ళారు. ఈ
సంవత్సరం మే 14న డ్యూక్ విశ్వవిద్యాలయం నుండి
స్నాతకోత్తర పట్టా స్వీకరించారు. తిరిగి వచ్చిన అనంతరం తిరిగి కేంద్ర
పట్టణాభివృద్ధి శాఖ కేబినేట్ మంత్రికి ఆంతరంగిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అమెరికాలో
పొందిన విద్యాపరమైన పరిజ్ఞానం, అనుభవం తోడ్పాటుతో
పట్టణాభివృద్ధి శాఖను ప్రగతి మార్గంలో పరుగు పెట్టిస్తారని, దేశాభివృద్ధి కోసం కొత్త
పథకాల అమలుకు బాటలు వేస్తారని ఆకాంక్షిద్దాం.
No comments:
Post a Comment