Wednesday, 12 July 2017

హరితహారం- ప్రగతిసారం ( హరితహారం ప్రారంభం సందర్భంగా ప్రచురితమైన కవిత)


మూడో విడత హరితహారం ప్రారంభం సందర్భంగా నేటి 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా కవిత

http://epaper.ntnews.com/c/20468235

Monday, 10 July 2017

ఆధునికాంధ్ర కవిత్వం- సినారె పరిశోధన (అమ్మంగి వేణుగోపాల్ గారి వ్యాసం)



'నమస్తే తెలంగాణ' దినపత్రిక సాహిత్య అనుబంధం 'చెలిమె' పేజీలో 10.07.2017 నాడు ప్రచురితమైన అమ్మంగి వేణుగోపాల్ గారి వ్యాసం 

Thursday, 6 July 2017

సంగీత హిమగిరి శిఖరం (జూలై 6న మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)


సంగీత హిమగిరి శిఖరం
-      డాక్టర్ రాయారావు సూర్య ప్రకాశ్ రావు
సంగీత, సాహిత్య రంగాలలో హిమగిరి శిఖరం మంగళంపల్లి బాల మురళీ కృష్ణ. వినూత్న రాగ, తాళాల సృష్టికర్త ఆయన. జుగల్ బందీ తరహా ప్రక్రియలను రూపొందించి, సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సుస్థిరపరచుకున్న పుంభావ కళా సరస్వతి ఆయన. పాతికవేల కచేరీలు చేసి భారతీయ సంగీత ఉత్కృష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన సంగీత కళానిధి ఆయన.  తన గాత్ర పారవశ్యంలో ప్రపంచాన్ని ముంచెత్తిన నయాగరా జలపాతం బాలమురళి. అపూర్వమైన స్వర, గమక కల్పనతో రస హృదయులను తన్మయత్వం చెందించిన సంగీత చక్రవర్తి ఆయన.
తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో 1930 జూలై ఆరున పట్టాభిరామయ్య, సూర్యకాంతం దంపతులకు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ జన్మించారు. ఆరు నెలలు కూడా నిండకుండానే తల్లి సూర్యకాంతం చనిపోయారు. దాంతో అన్నీ తానై పెంచారు తండ్రి పట్టాభిరామయ్య. ఆరేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడం ఆరంభించారు బాలమురళి. ఆయనకు తొలి గురువు తండ్రి పట్టాభిరామయ్య. ఆ తర్వాత కొచ్చర్లకోట రామరాజు దగ్గర సంగీతం అభ్యసించారు. తమిళనాడు లోని పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణ్యం అయ్యర్ దగ్గర శిష్యరికం చేశారు. అనంతరం సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి దగ్గర శిష్యుడిగా చేరారు. దక్షిణామూర్తి శాస్త్రి  తదనంతరం ఆయన శిష్యులు పారుపల్లి రామకృష్ణయ్య వద్ద సంగీత అభ్యసనను కొనసాగించారు.
ఎనిమిదేళ్ల ప్రాయంలోనే 1938లో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య ఏర్పాటు చేసిన సద్గురు ఆరాధనోత్సవాల సందర్భంగా తొలి కచేరీ చేశారు. తొలి కచేరీ తోనే రసజ్ఞుల ప్రశంసలందుకున్నారు. ప్రముఖ హరికథా విద్వాంసులు ముసునూరి సత్యనారాయణ ఆ కచేరీకి హాజరయ్యారు. చిన్నారి బాలుడైన మురళీకృష్ణ కచేరీకి ముగ్ధులై, ఆయన  పేరుకు ముందు 'బాల' అనే పదాన్ని ఆయనే జోడించారు.
పదకొండేళ్లకే మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుండి కచేరీ నిర్వహించారు బాల మురళీ కృష్ణ. అక్కడినుండి ఇక వెనుతిరిగి చూడలేదు. ఆయన సంగీత జీవితంలో ఎన్నో మైలురాళ్లు. గాయకుడిగా, వాగ్గేయకారుడిగా, సంగీత దర్శకుడిగా నిరుపమానమైన ప్రఖ్యాతినార్జించారు. స్వయంగా కీర్తనలను రాయడమే కాకుండా స్వరపరిచారు. స్వరరాగ సుధలో ఓలలాడించడమే కాకుండా వాద్య కారుడిగానూ ప్రసిద్ధుడయ్యారు.  వయోలిన్, వీణ, మృదంగం మొదలైన వాయిద్యాలలో నిష్ణాతుడు మంగళంపల్లి. త్యాగరాజ కీర్తనలకు తన గానంతో జీవం పోశారు. కర్ణాటక సంగీతంతో పాటు లలిత సంగీతంలోనూ ఆయన కృషి చేశారు.
పండిట్ భీమసేన్ జ్యోషి వంటివారితో కలిసి ఆయన కచేరీలు నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా,  కిశోర్ అమోన్ కర్ మొదలైన వారితో జుగల్ బందీ చేశారు. భద్రాచల రామదాసు కేర్తనలకు, అన్నమాచార్య కీర్తనలకు గాత్రం అందించారు.
సంగీత ప్రపంచానికి బాలమురళీ కృష్ణ అనేక రాగాలను అందజేశారు. తన తల్లి పేరుతో సూర్యకాంత రాగాన్ని సృజించారు. మహతి, లవంగి, ఓంకారి, సుముఖం, సర్వశ్రీ,, ప్రతి మధ్యమావతి, గణపతి సిద్ధి మొదలైన కొత్త రాగాలను సంగీత సరస్వతికి బహుమతిగా సమర్పించారు.
వినూత్న తాళ ప్రక్రియలనూ ఆయన ఆవిష్కరించారు. త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖిగా ఆ తాళాలను ప్రధానంగా వర్గీకరించారు. స్వరం, రాగం, తాళం, లయలపై సంపూర్ణ సాధికారత ఆయన సొంతం.
వరలక్ష్మీ పిక్చర్స్ వారి 'సతీసావిత్రి' తో 1957లో ఆయన సినీరంగ ప్రయాణం ప్రారంభమైంది. 400 పైగా చలన చిత్రాలకు సంగీతం అందించారు. 'నర్తన శాల' చిత్రంలో 'సలలిత రాగ సుధారస సారం', ముత్యాల ముగ్గు' సినిమాలో 'శ్రీరామ జయరామ', 'మేఘ సందేశం' చిత్రంలో 'పాడనా వాణి కళ్యాణిగా', 'శ్రీరామాంజనేయ యుద్ధం' సినిమాలో 'మేలుకో శ్రీరామా', 'గుప్పెడు మనసు' చిత్రంలో 'మౌనమె నీ భాష ఓ మూగ మనసా' మొదలైన పాటలు ఆయనకు విశేష ఖ్యాతినార్జించి పెట్టాయి.
తెలుగులో ‘జయభేరి’, ‘నర్తనశాల’, ‘ముత్యాలముగ్గు’, ‘దొరికితే దొంగలు’; కన్నడలో ‘హంస గీతె’, ‘మధ్వాచార్య’, ‘ముత్తిన హార’; మలయాళంలో ‘స్వాతి తిరునాళ్’; తమిళంలో ‘నవరతినం’, ‘కవిక్కుయిల్’; సంస్కృతంలో ‘ఆది శంకరాచార్య’ మొదలైన చలనచిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.  కన్నడ సినిమా ‘హంస గీతె’కు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా 1976లో పురస్కారం స్వీకరించారు. మరో కన్నడ చలనచిత్రం ‘మధ్వాచార్య’కు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా 1987లో అవార్డు పొందారు. 2011లో గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ జీవన సాఫల్య పురస్కారం పొందారు.
బాలమురళీకృష్ణ భారతీయ సంగీత ఉత్కృష్టతను ప్రపంచానికి చాటిచెప్పిన సంగీత కళానిధి. అమెరికా, బ్రిటన్, రష్యా, కెనడా, ఇటలీ, శ్రీలంక, ఫ్రాన్స్, సింగపూర్, మలేసియా మొదలైన వివిధ దేశాల్లో 25 వేలకుపైగా కచేరీలను ఆయన నిర్వహించారు. సంస్కృతం, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, మలయాళం, పంజాబీ భాషల్లో ఆయన సంగీతాభిమానులను తన గానామృతంలో ఓలలాడించారు. విదేశీభాష ఫ్రెంచి లోనూ ఆయన తన గాత్రాన్ని అందించడం విశేషం.
విజయవాడలోని సంగీత కళాశాలకు ఆయన మొదటి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో, శృంగేరీ పీఠంలో ఆస్థాన విద్వాంసుడిగా ఆయన కృషి శ్లాఘనీయం.
సంగీతంతోనే కాకుండా తన నటనతోనూ మెప్పించారు బాలమురళి. 1967లో ‘భక్త ప్రహ్లాద’ సినిమాలో నారదుడిగా నటించి, ఎస్వీరంగారావుకు ధీటుగా నటించాడన్న ప్రశంసలందుకున్నారు. “త్యాగయ్య’ అనే తమిళ స్టేజీ నాటకంలో నటించడంతో పాటు ఆ నాటకంలో పాడారు.
సంగీత కళా శిఖామణి, సంగీత విరించి, గాన కళాభూషణ, గాంధర్వ గాన సామ్రాట్, సంగీత కళా సరస్వతి, గాన కౌస్తుభ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞానశిఖామణి, జ్ఞాన చక్రవర్తి మొదలైన బిరుదులను వివిధ సంస్థలు ఆయనకు అందజేశాయి. మద్రాసు మ్యూజిక్ అకాడమీ ఆయనను ‘సంగీత కళానిధి’ అనే అవార్డుతో గౌరవించింది. సంగీత నాటక అకాడమీ ఆయనకు 1975లో పురస్కార ప్రదానం చేసింది.
పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ బిరుదులతో కేంద్ర ప్రభుత్వం బాలమురళీకృష్ణను గౌరవించింది. వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా 2005లో ‘షెవలియర్ ఆఫ్ ద ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్’ పురస్కారంతో గౌరవించింది. యునెస్కో సంస్థ మహాత్మాగాంధీ సిల్వర్ మెడల్ తో 1995లో సన్మానించింది.
అకాడమీలను రద్దు చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తీసుకున్న నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించారు బాలమురళీకృష్ణ. రద్దు నిర్ణయం పట్ల నిరసనగా రాష్ట్రంలో ఎన్నడూ పాడనని శపథం చేశారు. లక్ష్మీపార్వతితో పాటు అప్పటి సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న నేటి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి కృషి వల్ల తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అనంతరం బాలమురళీకృష్ణకు ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో స్వయంగా ఘన సన్మానం చేశారు.
ఛలోక్తులు విసరడంలోనూ బాలమురళీకృష్ణ దిట్ట. ప్రముఖ మృదంగ విద్వాంసుడు టి.వి.గోపాలకృష్ణన్ గాత్ర కచేరీలు కూడా నిర్వహించారు. ఆయనపై బాలమురళి అభిప్రాయాన్ని ఎవరో అడిగారట. దానికి బాలమురళి సమాధానం “అతను మృదంగం వాయిస్తున్నప్పుడు ప్రధాన గాయకుడిగానూ, పాడుతున్నప్పుడు పక్క వాయిద్యగాడిలాగానూ ప్రవర్తిస్తాడు” అని.
సంగీత ప్రపంచానికి విశేష సేవలందించిన బాలమురళీకృష్ణ గత సంవత్సరం నవంబరు 22న కన్నుమూయడం ఎవరూ తీర్చలేని లోటు. అన్ని గమకాలనూ సమర్థవంతంగా పాడి, కర్ణాటక సంగీత పరిధిని విస్తృతం చేసిన కళామతల్లి ముద్దుబిడ్డ బాలమురళీకృష్ణ. గాన గంధర్వుడిగా, వాద్యకారుడిగా, స్వర మాంత్రికుడిగా, స్వరకర్తగా, నటుడిగా విశేష కృషి చేసిన మంగళంపల్లి సేవలు సంగీతం ఉన్నంతకాలం నిలిచి ఉంటాయి.


Sunday, 2 July 2017

అన్వయ దోషం


మొన్న లంచ్ బెల్లు తర్వాత మొదటి పీరియడ్ బెల్లు కాగానే ఏడో తరగతి చదివే ఒక విద్యార్థి దగ్గరికొచ్చాడు. విషయమడిగితే "మా అమ్మ మా నాన్న చచ్చిపోయిండని చెప్పింది సార్" అన్నాడు. ఏడుస్తున్న ఆ విద్యార్థిని అనునయించాను. ఇంటికి పంపించాను. తీరా వేరే పిల్లలని అడిగితే చనిపోయింది ఆ విద్యార్థి తండ్రి కాదని, తాత అని తెలిసింది. అప్పుడు అతను చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకున్నా. తేలిందేంటంటే "మా నాన్న చనిపోయాడు" అని ఆ విద్యార్ధి తల్లి చెప్పింది అతనితో. పరోక్ష కథన పద్ధతి ఆ విద్యార్థికి తెలియకపోవడంతో నేను తప్పుగా అర్థం చేసుకున్నా.
ఇంతకీ దోషం ఎవరిది? అతను చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకోలేని నాదా? అన్వయ దోషంతో చెప్పిన ఆ విద్యార్థిదా?

ఈసురోమని పంతుళ్లుంటే దేశమేగతి బాగుపడునోయ్?


రేపటి దేశ భవిష్యత్తు నేటి బాలలదే అంటాం. బాలలను తీర్చి దిద్దే మహత్తర బాధ్యతను భుజస్కంధాలపై వేసుకునే ఉపాధ్యాయుల పాత్ర దేశ భవిష్యత్ రీత్యా అత్యంత ప్రధానమైనది. అలాంటి ఒక ఉపాధ్యాయుడు ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నివేశం ఆధారంగా ఒక చక్కటి వ్యాసం అందజేశారు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ సభ్యులు మన్మథ రెడ్డి గారు. విద్యావ్యవస్థలో ప్రమాణాలకు కారణమయ్యే  ఉపాధ్యాయుల అవగాహనలేమి క్షంతవ్యం కాదు. విద్యాశాఖలో సీనియర్ అధికారిగా అనుభవం గడించిన మన్మథరెడ్డి గారి వ్యాసం ఈ రోజు (02.07.2017)  'నమస్తే తెలంగాణ' దినపత్రిక లో ప్రచురితం.

Wednesday, 28 June 2017

సంస్కరణల మార్గదర్శి ( పి.వి.నరసింహా రావు జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

ఈరోజు (28.06.2017) పి.వి.నరసింహా రావు జయంతి. ఈ సందర్భంగా 'ఆంధ్ర జ్యోతి' దినపత్రిక ఎడిట్ పేజీలో ఈరోజు ప్రచురితమైన నా వ్యాసం.

దేశాన్ని గట్టెక్కించిన మేధావి (పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

ఈరోజు (28.06.2017) పి.వి.నరసింహారావు జయంతి. ఈ సందర్భంగా 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా వ్యాసం