పాఠకుడితో కవి చేసే ఒడువని ముచ్చట
- డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు
ఎక్కడో ఒక దగ్గర ఒడిసి పట్టుకుంటారు- కదలకుండా... కదిలే ఆలోచన రాకుండా. ముచ్చట మొదలు పెడతారు ‘నేనేమీ... మాట్లాడను’ అంటూ. ఏం మాట్లాడనన్నాక ఎవరైనా ఏం చేస్తారు? ‘ఈ ఒక్క ముచ్చట వినిపో’ అంటే ఏం చేస్తాం? ‘సరే. ఒక్క ముచ్చటే కదా’ అని ఆగిపోతాం. ఆ ఒక్క ముచ్చటా వినిపోదామనిపిస్తుంది. ఏం మాట్లాడనంటే కూడా అంతేగా. అలా ఒడుపుగా ఒడిసి పట్టుకున్నాక ఒక్కో ముచ్చట, ఒక్కో ముచ్చట - ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటాయి. మొదలైన తర్వాత కదలని పరిస్థితి పాఠకుడిది. కదిలే ఆలోచన కూడా రాని స్థితిలోకి పాఠకుడిని తీసుకుపోయే కవిత్వం కొనకంచిది.
పాఠకుడితో కవి నేరుగా చేసే సంభాషణ కొనకంచి ‘నేనేమీ... మాట్లాడను’. ఈ కవిత్వంలో వినిపించేవి మాటలు కావు- మనుషుల మనస్తత్వాల సంఘర్షణలు. ఆ సంఘర్షణల్లోంచి పుట్టుకొచ్చిన వేదన. సగటు మనిషి ఆవేదన కంటి నుండి ధారలా కారిపోయి, ఇంకిపోయి, మబ్బుల్లోకి చేరి, ద్రవీభవిస్తే అచ్చం కొనకంచి కవిత్వం లాగే ఉంటుంది. మనిషి ఆవేదనను వర్షించే మబ్బుతునకను కవి మోసుకొస్తాడు. ఉరమనంటూనే ఉరిమే ఉరుము కొనకంచి కవిత్వం. మెరవనంటూనే అన్ని మూలలకూ ప్రసరించే మెరుపు కొనకంచి కవిత్వం.
కొనకంచి విస్పష్టమైన అభిప్రాయాలను ప్రకటిస్తారు . లోపలో మాట, బయటో మాట మాట్లాడే మాట ఈ కవిది కాదు. మాట్లాడనంటూ మాట్లాడే మాట ఉండాల్సినంత శక్తివంతమైన కవిత్వం ఆయనది. ఏ విషయంలో అయినా – మేధావులను దుయ్యబట్టినా, ప్రజాస్వామ్యాన్ని విమర్శించినా - నిక్కచ్చితనం ఆయన కవిత్వం సొంతం. లేనిమాటలు, గాలిమాటలు చెప్పి, ఆత్మవంచన చేసుకునే కవుల కవిత్వం వినాలని ఉందా? అయితే ఈ కవిత్వాన్ని అస్సలు చదవకండి. ఉబుసుపోకకు రాసే కవుల కవిత్వం చదువుతూ కాలం గడపండి. మొహమాటంతో‘ఆల్ ఈజ్ వెల్’ అని రాసే అద్భుత కవిత్వాల వాసన ఆఘ్రాణించాలని ఉంటే దయచేసి ఈ కవిత్వం చదవడం మొదలు పెట్టకండి. ఎందుకంటే చదవడం మొదలు పెడితే, ఈ కవి మిమ్మల్ని చివరివరకూ చదివిస్తారు, మీ అభిప్రాయం మార్చిపారేస్తారు .
రాజకీయంపై చాలామంది కవులు చాలా రకాలుగా విమర్శలు రాశారు. ఈ కవి ఆలోచనా ధోరణి భిన్నం. రాసే శైలి విభిన్నం. అందుకే
‘‘ఈ రాజకీయతరం పాలరాతి భవనాలకు
దిష్టి తగలకుండా కట్టిన పేదవాడి తల మాకు కనిపిస్తున్నది’’
అంటారు.
‘‘ఈ రాజకీయతరం మృగభాష మాట్లాడుతుంది’’
అని విమర్శిస్తారు.
కొనకంచికి వర్తమానంపై సందేహాలెన్ని ఉన్నా భవిష్యత్తు బాగుంటుందన్న ఆశావహ దృక్పథముంది. అందుకే
‘‘రేపటి తరాల్లో.. పిరికి మనుషులుండరు
కత్తుల్లాంటి మనుషులు మాత్రమే మిగిలి వుంటారు’’
అన్న ధీమా వ్యక్తం చేస్తారు.
సమకాలీన ఓటు బ్యాంకు రాజకీయాలపై ఎక్కుపెట్టిన కవితాస్త్రం ‘ఓ.. మార్చురీ గీతం’. ఈ కవితలో ఎన్నిక రాజకీయాలను తూర్పారబడతారు కొనకంచి.
‘‘పార్లమెంటు అంటే మరేమీ కాదు,
అది మీరెన్నుకున్న..
మీరే కావాలని గెలిపించుకున్న
మీ ఆత్మహత్య..’’
అంటారు. శాసనసభపై కూడా ఆయన విమర్శ అలాంటిదే.
‘‘అసెంబ్లీ అంటే మరేమీ కాదు
అది మీరెన్నుకున్న
మీరే కావాలని గెలిపించుకున్న
మీ సొంత వికృత హత్య’’
అంటారు. చట్టసభల ఎన్నికల్లో అనేక ప్రలోభాలు. ఆ ప్రలోభాలకు లొంగి వేసే ఓటు వల్ల తమను తామే హత్య చేసుకున్నట్టవుతుందని విమర్శిస్తారు.
ఎన్నికలయిపోయిన తర్వాత ఓటర్లను పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండదు. ఎవరూ పట్టించుకోరు. ఈ పరిస్థితిని చాలా సమర్థవంతంగా చిత్రించారు కొనకంచి.
‘‘ఎత్తిన జెండా దించేయగానే
జెండా కొయ్య చచ్చిపోతుంది
ఎన్నికలయిపోగానే.. అధికారంలోకి రాగానే
జనం జెండా కొయ్యలైపోతారు
మళ్ళీ ఎన్నికలచ్చేదాకా.. దేశం గోడవున్లో
భద్రంగా .. కుళ్ళిపోతారు.. చెదపట్టి మట్టిగా పోతారు’’
అంటారు. జెండా ఎత్తేదాకా ఎంతో విలువ. దాన్ని దించగానే కొయ్యగా మారిపోతుంది. అందుకే కవి ఎత్తిన జెండాలో ‘కొయ్య’ అనే పదాన్ని వాడకుండా దించిన జెండాలో ఈ పదాన్ని వాడడం ద్వారా కొయ్యబారిపోవడాన్ని ప్రతీకాత్మకంగా చూపించారు.
పరస్పర విరుద్ధ పదాలతో తన భావాలను ఎలా సమర్థవంతంగా వ్యక్తీకరించవచ్చో కొనకంచికి బాగా తెలుసు. పరస్పర విరుద్ధ పదాలు అనేకం వేర్వేరు సందర్భాల్లో వాడడం కనబడుతుంది. ‘నీలోంచి.. నన్నోసారి ఆవిష్కరించుకుందామని’ అనే కవితలో
‘‘నేను నీకోసం భావసహిత
ఓ.. కొంగ్రొత్త రాగమవటం
అసంకల్ప సంకల్పంగా.. జరిగిపోతుంది’’
అంటారు. ఈ పంక్తుల్లో ‘అసంకల్ప, సంకల్పం’ అనే పరస్పర వ్యతిరేకార్థక పదాలను వెంటవెంటనే వాడడం ద్వారా తాను చెప్పదలచుకున్న అంశాన్ని ఎంతో బలంగా చెప్పగలిగారు కవి. ‘అసంకల్ప సంకల్పం’ అంటే? గందరగోళంలో పడిపోయిన పాఠకుడికి తర్వాతి పంక్తులు వివరణ ఇస్తాయి.
మనిషికీ, మనిషికీ మధ్య అంతులేని అగాధం. మన కళ్ల ముందే తిరుగుతున్న వ్యక్తులు మనకు తెలియదు. ఏవో తెలియని అడ్డుగోడలు. పక్కింట్లో ఉండేవాడే తెలియని విష సంస్కృతిలో మన జీవనం. అందుకే మనుషులు ఒకరికొకరు తెలిసినట్టే ఉంటారు, కానీ తెలియదు. తెలియనట్టే ఉంటారు, కానీ తెలుసు. అందుకే ‘నేనే .. ఓ .. పోయెం’ కవితలో
‘‘పరిచిత.. అపరిచితమయిన నువ్వు
ఇక ఎంతమాత్రమూ కనిపించవు’’
అంటారు.
ఇవే వైరుధ్య పదాల కలయికతో భావాన్ని సమర్థవంతంగా చెప్పడం ‘వాడెలా స్నేహితుడవుతాడు...?’ అనే కవితలో కనబడుతుంది. కొంతమంది ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత మూలాలను మర్చిపోవడం జరుగుతుంది. తాను ఆ స్థాయికి ఎదగడానికి దోహదం చేసిన మిత్రులను, బంధువులను మర్చిపోయే వ్యక్తులు తరచుగా తారసపడుతుంటారు. అలాంటి వారు ‘స్నేహం’ అనే పదానికే కళంకం తెస్తారు. అలాంటి ఒక ప్రముఖ తెలుగు దర్శకుని స్నేహాన్ని గుర్తుచేసుకుంటారు ఈ కవితలో. ఇక్కడ కూడా పైన పేర్కొన్నట్టే ‘పరిచిత, అపరిచితం’ అనే వైరి భావాలను ప్రయోగించారు.
‘‘చిర పరిచిత అపరిచితుడైన.. నిన్ను గుర్తు పట్టటం..
ఎవరికీ ఏమంత కష్టం కాదు..
ఫెటిల్లున పగిలిన.. నీ మాయా.. మహల్.. ధ్వానం
ఈ ప్రపంచమంతా వినిపించే రోజు
చాలా దగ్గరలోనే ఉన్నది..’’
అని వైరుధ్య పదాలను ఉపయోగించారు.
పేరా కొద్దీ వాక్యాలను కుమ్మరిస్తే తప్ప చెప్పలేని భావాలను ఒకే వాక్యంలో చెప్పేయడం కొనకంచికి మంచినీళ్లు తాగినంత పని. ‘మా వూరు పల్లెటూరు’ కవితలో ఊరిలో నెలకొన్న దైన్యాన్ని వర్ణిస్తారు.
‘‘ఊళ్లల్లో బావులు ఎండిపోయాయి
ఊళ్లల్లో మనుషులు ఎండిపోయారు’’
అంటారు. బావులు ఎండిపోవడం, మనుషులు ఎండిపోవడం ఒక్కటేనా? హృదయాలను ద్రవింపజేసే వాక్యాలివి. మనిషి తనలోని మంచితనాన్ని పోగొట్టుకున్నాడని ఒకే వాక్యంలో ఆర్ద్రంగా చెప్పగలిగారు.
అమ్మపై చాలామంది కవులు కవిత్వం రాశారు. కొనకంచి కూడా. ‘అమ్మ’ కవితలో
‘‘అమ్మ.. అంటే
తొలకరి మట్టిలో
దాచిన రేపటి కొత్త విత్తనం..’’
అని నిర్వచిస్తారు.
కమ్యూనిజాన్ని, విప్లవాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తారు కొనకంచి. ‘నాకు ఇప్పుడు అసలు నిజం తెలియాలి’ కవితలో
‘‘భవిష్యత్తు దృష్టి ఏమాత్రం లేకుండా
నీ కళ్లకేమో.. కమ్యూనిజం పేరుతో
ఇనుప కచ్చడాలు బిగించుకున్నావు’’
అని కమ్యూనిస్టు నాయకులను విమర్శించారు. కమ్యూనిస్టు నాయకుల్లో ద్వంద్వ వైఖరులు ఉన్నాయని ఆయన ఆరోపణ. అందుకే
‘‘ఈ దేశం మట్టిని ప్రేమిస్తున్నట్టు
పైకి నవ్వుతూ కనిపిస్తావు
కాళ్ల కింద మట్టిని ఎవ్వరూ చూడకుండా
కేజీ లెక్కన అమ్మేందుకు..’’
అని తీవ్రస్థాయిలో విమర్శిస్తారు.
విప్లవాన్ని కూడా విమర్శించారు కొనకంచి.
‘‘విప్లవం అంటే
మనుషుల్ని నడిబజారులో అమ్మటమే అయినప్పుడు
అన్నయ్యా.. విప్లవం పేరుతో
మార్కెట్లో అమ్ముడుపోయిన మనుషులెవ్వరు?
విప్లవం పేరుతో వాళ్ళని అమ్మిందెవరు?’’
అని ప్రశ్నిస్తారు.
పరస్పర సాహచర్యం వల్ల అనేక విషయాలను నేర్చుకుంటాం. మరో మనిషితో స్నేహం అనేక అంశాలను నేర్పుతుంది. అందుకే బయటి ప్రపంచంతో సన్నిహిత సంబంధం ఉన్నవాడు అపారజ్ఞానాన్ని వృద్ధి చేసుకునే అవకాశాలను కలిగిఉంటాడు. ఈ విషయాన్నే తెలియజేస్తూ రాసిన కవిత ‘మనిషి.. రోడ్డు.. ఒక బుక్ ఫెయిర్’.
‘‘మనిషంటే
ఆలోచనలు.. అవసరాలు ఉన్న మస్తకం
మనిషిని అర్థం చేసుకోవటం అంటే
బుక్ ఫెయిర్లో ఉన్న పుస్తకాలన్నీ హోల్సేల్గా
ఒక్క జన్మలో చదవటమే’’.
అని చెప్తారు.
మనిషి తీరిక లేకుండా అయిపోయాడు. కనీసం ఏడ్వడానికి కూడా సమయం లేనంత బిజీగా కాలం గడుపుతున్నాడు. ప్రశాంతంగా, తనివితీరా ఏడుద్దామని ఉన్నా జానెడు జాగాలేని పేదవారెందరో. ఈ పరిస్థితిని, దైన్యాన్ని చిత్రించిన కవిత ‘కాల్ మనీ.. ఆంధ్ర ప్రదేశ్’.
‘‘కనీసం ప్రశాంతంగా ఏడవటానికి
జానెడు జాగాలేని.. బీదవాళ్లు
నా చుట్టూ ఉన్నప్పుడు
నేను దాచుకున్న నా దు:ఖం కూడా
ఓ విలాసవస్తువుగా మారిపోయింది’’
ఎంతో వేదన చిత్రితమైన కవిత ఇది. సుఖం విలాసవస్తువు కావడం సాధారణం. దు:ఖం కూడా విలాసవస్తువుగా మారడమే విషాదం.
మాతృమూర్తిపై కవిత్వాన్ని అనేకమంది కవులు రచించారు. సోదరిపై కూడా చాలా మంది కవిత్వం రాశారు. కానీ పెళ్లి తర్వాత ఇంటిపేరును కూడా మార్చుకుని, తమ జీవితంలో అధికశాతం కాలం పురుషుడికి సేవలందించే భార్యపై కవిత్వం రాసినవారు తక్కువ. భార్యపై కొనకంచి రాసిన కవిత ‘భార్య (ట్రిబ్యూట్ టు ఏ వైఫ్)’. ‘‘మూడు ముళ్లు.. ఏడు అడుగులు / ఒక్క రాత్రితో నేను.. నీకు.. / కొత్త ఇల్లుగా మారాను’’ అంటూ భార్య తన ఉనికిని తాను కోల్పోయిన వైనాన్ని వివరిస్తారు.
‘‘నీకంటూ.. నీకు నువ్వు ఏమీ మిగుల్చుకోకుండా
నీ ఇంటి పేరు కూడా మార్చేసుకున్నావు
వేడి అన్నం మీద పడ్డ.. వెన్న ముద్దలా
నీ.. నెత్తురు వెచ్చించి..
మా జీవితాల అగ్గిలో కరిగిపోయావు’’
భార్య కొత్తగా అత్తవారింట్లో ప్రవేశించిన మరుక్షణం నుండి ఆమె ప్రాధాన్యతను చాలా అద్భుతంగా వివరించిన కవిత ఇది.
కొనకంచి కవిత్వం మొదటి నుండి చివరిదాకా ఆకట్టుకుంటుంది. ఆరంభం ప్రత్యేకం, ముగింపు కూడా ప్రత్యేకం.
‘వాడెలా స్నేహితుడవుతాడు..?’’ కవితను
‘‘ఇరవయ్యేళ్లప్పుడు.. ఆత్మవంచన.. ఓ కే.
నలభయ్యేళ్లప్పుడు కూడా ఆత్మవంచన.. ఓ కే...
అరవయ్యేళ్ల దెగ్గిర కూడా..
ఆత్మవంచన ఏంటిరా.. రాక్షసుడా...’’
అనే వాక్యాలతో ప్రారంభిస్తారు. చెప్పబోయే అంశానికి నేపథ్యాన్ని సూటిగా పేర్కొనడం ఈ వాక్యాల్లో కనబడుతుంది.
‘అవును! వెళ్ళిపోయిన వాడెప్పుడూ..’ అనే కవిత
‘‘ఆ సీనియర్ సిటిజెన్ అడుగు చప్పుళ్లు
మీకు ఇక వినిపించవు
అన్న.. అక్క.. బావా.. అమ్మా..
అన్న అతని మాటలు కూడా ఇక వినిపించవు’’
అనే వాక్యాలతో మొదవుతుంది. గతించిన ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేయబోతున్న విషయం ప్రారంభం చదివితే తెలుస్తుంది.
‘ఓ నటి ఆత్మహత్య’ కవిత
‘‘అవును..
చావు కూడా కొందరికి ఆఖరి గెలుపే’’
అనే పంక్తుతో ముగుస్తుంది. ‘మా వూరు పల్లెటూరు’ కవిత
‘‘భవిష్యత్తులో.. పల్లెటూర్లంటే..
కాలిపోయిన పున్నాగ వృక్షాలు.. పాడుపడ్డ రామాలయాలు..
నిర్జీవమయిన ఉదయ సాయంకాలాలు మాత్రమే’’
అనే వాక్యాలతో ముగుస్తుంది. పల్లెటూరి పరిస్థితిని వివరిస్తూ చివర్లో ఆ పరిస్థితులను ఒకే స్టేట్మెంట్ రూపంలో చెప్పడం ఈ పంక్తుల్లో కనిపిస్తుంది.
‘మనిషి.. రోడ్డు .. ఒక బుక్ ఫెయిర్’ అనే కవితలో ఇవీ ముగింపు వాక్యాలు.
‘‘పుస్తకం అంటే మనిషికి
కడవరకూ తోడుండే హృదయం
నేనంటే మరేమీ కాదు
ఒక కొత్త బుక్ ఫెయిర్ని.
నడుస్తున్న ప్రాణమున్న మస్తకాన్ని’’.
ఈ ముగింపు కూడా స్టేట్మెంట్తోనే ఉండడాన్ని గమనించవచ్చు.
కొనకంచి కవిత్వ ప్రత్యేకత శీర్షికావైవిధ్యం. తన కవిత్వ సంపుటాల పేర్లలో వైవిధ్యంతో చూడగానే ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతారు కొనకంచి. ఆయన రాసిన ‘చూపులు వాలిన చోట’, ‘మంత్రలిపి’ ఇందుకు ఉదాహరణలు. ‘నేనేమీ.. మాట్లాడను’ కూడా ఆ కోవలోకే వస్తుంది. రాబోయే కవితాసంపుటాల శీర్షికలు కూడా వైవిధ్యంగానే ఉంటాయన్న సూచన కూడా ఈ కవితా సంపుటిలో ఉంది.
కవితల శీర్షికలు కూడా అంతే. కొన్ని కవితల శీర్షికలు స్టేట్మెంట్స్ రూపంలో ఉంటాయి. ‘కత్తి మాత్రమే నిజం మాట్లాడుతుంది’, ‘మరణించేది ఎప్పుడూ యువతరమే’, ‘నిజమే మాస్టారు! మీరన్నది నిజమే’, ‘అందరిలాగే నేనూ వెళ్ళిపోతాను’ మొదలైనవి ఇందుకు ఉదాహరణలు. వైవిధ్యమైన కవితల శీర్షికలకు ఉదాహరణలు ‘రాబోతున్న ఒక డేంజర్ గీతం’, ‘నీకు నువ్వే కవిత్వంగా మారాలి’. ఈ శీర్షికలు పాఠకుడి చేత ఆ కవితను చదివించేలా చేస్తాయి.
కొనకంచి కవిత్వంలో మరో ప్రత్యేకత దీర్ఘత్వం. దీర్ఘ కవితలోనూ చదువరికి ఎక్కడా విసుగు పుట్టకుండా చదివించగల నేర్పరితనం ఆయన సొంతం కాబట్టే దీర్ఘ కవితలైనా పాఠకుడు చివరిదాకా చదివేస్తాడు. బహుశా కొనకంచి కవిత్వంలో బలం దీర్ఘత్వమే. వివిధ కోణాలను స్పృశించి, పాఠకుడిని అన్ని మూలల్లోకీ తొంగిచూసేలా చేయడంలో దీర్ఘత్వం అవసరాన్ని కవి గుర్తించినట్టు ముందుమాటని బట్టి తెలుస్తుంది.
భాషలో, భావంలో, వస్తువులో, శైలిలో విక్షణత సాధించిన కొనకంచి కవితా సంపుటి ‘నేనేమీ... మాట్లాడను’ కవిత్వపు శక్తికి మరో నిదర్శనం.
No comments:
Post a Comment